అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి
కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించిన బీఆర్టీయూ
కాకతీయ, హనుమకొండ: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో కార్మిక సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చి అధికారులను కలిశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు కనీస సౌకర్యాలతో పాటు వెల్ఫేర్ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే పరిష్కరించి బాధితులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) జారీ చేయడంతో పాటు, వారికి వ్యాపార నిర్వహణకు ముద్ర రుణాలు, అవసరమైన చోట షెడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆర్థిక సహాయం అందజేయాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

