చేతి పంపు స్థానంలో మోటార్ కనెక్షన్
ప్రజా సమస్యలపై స్పందించిన సర్పంచ్ భరత్ కుమార్
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధి గట్టుకింది పల్లెలో తాగునీటి సమస్యను సర్పంచ్ రడం భరత్ కుమార్ పరిష్కరించారు. ఇక్కడ చాలా రోజులుగా చేతిపంపు నిరుపయోగంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి నేపథ్యంలో నీటి కొరత మరింత ఎక్కువ కావడంతో గ్రామస్తులు ఈ సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సర్పంచ్.. సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించారు. పాడైపోయిన చేతిపంపును తొలగించి, ఆ స్థానంలో కొత్తగా మోటార్ పంపును ఏర్పాటు చేయించి వాటర్ ట్యాంకుకు కనెక్షన్ ఇప్పించారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తొలగాయి. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని సర్పంచ్ తెలిపారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించడంపై స్థానిక మహిళలు, వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు.

