భద్రకాళి చెరువు పనులు వెంటనే పూర్తి చేయాలి
పేదలకు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
వర్షాకాలానికి ముందే భద్రకాళి పనులు పూర్తి చేయాలి
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో జాప్యంతోనే పనులు ఆలస్యం
మాజీ విప్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
29న వరంగల్కు కేటీఆర్
3,500 మంది కార్యకర్తలతో భారీ సమావేశం
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరానికి అత్యంత కీలకమైన, జీవనాడిగా ఉన్న భద్రకాళి చెరువు పూడికతీత పనులు నెలల తరబడి సాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై మాజీ విప్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. శనివారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు ఘోరంగా ముంపునకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాదైనా వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేయకపోతే మళ్లీ అదే ముంపు పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “కాంట్రాక్టర్లకు పాత బిల్లులు చెల్లించకపోవడం వల్లే భద్రకాళి పనులు ఆలస్యమవుతున్నాయి. క్షేత్రస్థాయి పనులను పక్కనబెట్టి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయడంలో నిమగ్నమైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నగరాభివృద్ధిపై అస్సలు చిత్తశుద్ధి లేదు” అని వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఏడాది భద్రకాళి మత్తడి గేట్లు, 100 ఫీట్ల రోడ్డు అండర్ డ్రైన్ గేట్లను సకాలంలో నిర్వహించకపోవడం వల్లే నగరం మునిగిపోయిందని.. ఈ ఏడాదైనా ముందస్తు చర్యలు తీసుకుని వరంగల్ను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, భద్రకాళి చెరువు వద్ద వరుసగా జరుగుతున్న మునక ఘటనలు, ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోగా, తాజాగా మరో యువకుడు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ.. చెరువు వద్ద కనీస రక్షణ, ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఈనెల 29న వరంగల్కు కేటీఆర్: నన్నపునేని నరేందర్
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 29న వరంగల్ పర్యటనకు రానున్నట్లు వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని 24 డివిజన్ల నుంచి సుమారు 3,500 మంది గులాబీ శ్రేణులు ఈ భారీ భేటీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ హయాంలో నిరుపేదలకు పంపిణీ చేసిన ఇండ్ల పట్టాలపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నరేందర్ విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో 3,500 పట్టాలు, పశ్చిమలో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మరో 5,000కు పైగా పట్టాలు ఇచ్చామని.. పేదలకు పట్టాలిచ్చిన చరిత్ర కాంగ్రెస్కు ఎన్నడూ లేదని స్పష్టం చేశారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పర్యటనతో వరంగల్ జంట నగరాల బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం రాబోతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు దిడ్డి కుమారస్వామి, రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, పులి రజనీకాంత్, నయీమొద్దీన్, మోడం ప్రవీణ్, నర్సింహారావు, గౌస్ ఖాన్, మూటిక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

