కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నాకు మద్దతు
కాకతీయ, భూపాలపల్లి / మలహర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బొగ్గు గనుల వేలం విధానానికి వ్యతిరేకంగా, అలాగే సింగరేణి ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన ధర్నాకు బీసీఎస్సీ జేఏసీ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బీసీఎస్సీ జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్ మాట్లాడుతూ, సింగరేణి అధికారులు, ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని పేర్కొన్నారు. వెంటనే జీతాల ఎక్స్గ్రేషియా పెంపును అమలు చేయాలని, జీతంలో భాగమైన పీఆర్పీని పెంచి చెల్లించాలని, పారదర్శకమైన ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థ అని, అలాంటి సంస్థలో పనిచేస్తున్న అధికారుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి అన్ని ప్రజాస్వామ్య శక్తులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కో కన్వీనర్ జోగుల సమ్మయ్య, కొత్తూరి రవీందర్, జిల్లా కో ఆర్డినేటర్ మరియు జిల్లా నాయకులు శిలపాక హరీష్, మేకల ఓంకార్, రేణుకుంట్ల మహేష్, పక్కల రాజేందర్ పాల్గొన్నారు.

