ములుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
సీఎం పర్యటనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
మేడారం మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
వర్షాకాలంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ పనుల్లో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కాకతీయ,ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ములుగు జిల్లాలో పర్యటించే సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం ఆలయ అభివృద్ధి పారిశుధ్య నిర్వహణ ఐడీఓసీ పనుల పురోగతి రామచంద్రపురం భూసర్వే పైలాన్ నిర్మాణం మరియు వర్షాల పరిస్థితిపై ఆమె సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ద్వారా 6,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి సీతక్క వెల్లడించారు. జాతీయ రహదారి పక్కన గట్టమ్మ దేవాలయం సమీపంలో పంచాయతీరాజ్ రోడ్డు పనులకు భూమిపూజతో పాటు నూతన కలెక్టరేట్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కేంద్రీయ విద్యాలయం పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు కరకట్టల నిర్మాణం వంటి కీలక పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ఒకే శిలాఫలకంపై పొందుపరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆమె సూచించారు.
మేడారం ఆలయ సమగ్ర ప్రణాళిక
సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో భూసేకరణ రహదారుల విస్తరణ క్యూ లైన్ల పునర్వ్యవస్థీకరణ అతిథి గృహం ఆసుపత్రి కాటేజీలు పార్కింగ్ పారిశుధ్య సదుపాయాలు మరియు జంపన్న వాగు పరిసరాల అభివృద్ధి అంశాలతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆమె ఆదేశించారు. ప్రకృతి అందాలను పరిరక్షిస్తూ పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా పనులు చేపట్టాలని గట్టమ్మ దేవాలయం పంచాయతీరాజ్ పైలాన్ ట్రైబల్ యూనివర్సిటీ కలెక్టరేట్ తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ ములుగు జిల్లాను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామచంద్రపురం పరిధిలోని 10,600 ఎకరాల భూముల రీసర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు రామప్ప లక్నవరం పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని ఆమె కోరారు.
వర్షాకాలంలో అప్రమత్తత
వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. భారీ వర్షాలు వరదల అవకాశాలను ముందుగానే అంచనా వేసి లోతట్టు ప్రాంతాలు వాగులు వంకల పరిసర గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని మంచినీటి సరఫరాలో కలుషితం కాకుండా పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని అధికారులను సూచించారు. వాగులు వంకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గర్భిణీలు వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారిని అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని మరియు అటవీశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని దశలవారీగా బకాయిలు విడుదల చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి మరియు ఎం సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

