చెరువులను చెరబడుతున్న మెఘా
కాకతీయుల గొలుసుకట్టు చెరువుల్లో విధ్వంసం
గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం మాటున మట్టి దోపిడీ
ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేత
అరకొర అనుమతులతో ఇష్టానుసారంగా మట్టి తోలకాలు
అనుమతులు ఒకలా.. తవ్వకాలు మరోలా!
నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో తవ్వకాలు
కనిపించని ఇరిగేషన్ శాఖ.. కన్నెత్తి చూడని అధికారులు!

కాకతీయ,నిఘా ప్రతినిధి : మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల ముసుగులో కాకతీయుల కాలం నాటి అపురూపమైన జల సంపద కనుమరుగవుతోంది. ఒకప్పుడు వరంగల్కు జీవనాధారంగా, కాకతీయుల సాంకేతిక నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన గొలుసుకట్టు చెరువులు.. నేడు మెఘా కంపెనీ స్వార్థపూరిత తవ్వకాలకు బలైపోతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల పేరుతో వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలంలోని బొడ్డు చింతలపల్లి, గట్టుకింది పల్లె చెరువులను నిబంధనలకు విరుద్ధంగా మెఘా కంపెనీ తోడేస్తోంది. పరిమిత స్థాయిలో అనుమతులు పొందిన సదరు సంస్థ ఆ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, భారీ యంత్రాలతో చెరువులను గుల్ల చేస్తోంది. ఎంతలా ఉంటే నిత్యం వందలాది టిప్పర్లతో చెరువుల్లో విధ్వంసం సాగిస్తోంది.
అనుమతులు ఒకలా.. తవ్వకాలు మరోలా!
సాధారణంగా చెరువుల నుంచి మట్టిని సేకరించేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధిస్తుంది. నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత లోతులో మాత్రమే మట్టిని తీసుకోవాలని, చెరువు స్వరూపం దెబ్బతినకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ మెఘా కంపెనీ వ్యవహారం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. చెరువుల నుంచి నిర్ణీత పరిమాణంలో మాత్రమే మట్టిని తీసుకునేందుకు అనుమతులు మంజూరైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న తవ్వకాలు మాత్రం నిబంధనలకు పాతర వేస్తున్నాయి. అనుమతుల పరిధిని దాటి యంత్రాలతో లోతుగా తవ్వుతూ, అందిన కాడికి మట్టిని తరలిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని సైతం ఎగవేస్తూ, అత్యంత బాధ్యతారాహిత్యంగా అక్రమాలకు పాల్పడుతోంది. స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆక్రమణలను అడ్డుకుని, అనుమతి పత్రాలు చూపించాలని కోరినా, కంపెనీ ప్రతినిధులు వాటిని చూపకుండా దాటవేస్తుండటం వెనుక భారీ అక్రమాలు ఉన్నాయని అర్థమవుతోంది.
ఇరిగేషన్ అధికారుల తీరుపై అనుమానాలు
ఈ మొత్తం వ్యవహారంలో నీటిపారుదల శాఖ అధికారుల పాత్ర అనుమానాస్పదంగా మారింది. మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు, ఆ తర్వాత తవ్వకాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను కనీసం సందర్శించకపోవడం, అక్రమాలను అడ్డుకోకపోవడం చూస్తుంటే, వారి మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ సత్యశారద భూగర్భ జలాల పరిరక్షణపై, చెరువుల సంరక్షణపై పదేపదే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, క్షేత్రస్థాయి సిబ్బంది మెఘా కంపెనీకి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చెరువుల మనుగడకే ముప్పు..!
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని, తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తవచ్చని వాతావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చెరువు గర్భాన్ని లోతుగా తవ్వడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గడమే కాకుండా, భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది. శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా చేస్తున్న ఈ తవ్వకాల వల్ల చెరువుల సహజ సిద్ధమైన నీటి నిల్వ వ్యవస్థ దెబ్బతింటోంది. భవిష్యత్తులో ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కాకతీయులు చెరువులను నిర్మించింది భూగర్భ జలాలను కాపాడి, రైతులకు సాగునీరు అందించడానికి. కానీ, నేడు మెఘా కంపెనీ చేస్తున్న తవ్వకాలు ఆ గొలుసుకట్టు వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కాకతీయుల కీర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ గొలుసుకట్టు చెరువులు ఇప్పుడు ఒక ప్రైవేటు సంస్థ స్వార్థానికి బలైపోతున్నాయి. ఇష్టారీతిన జరుగుతున్న ఈ తవ్వకాలతో చెరువుల సహజ స్వరూపం దెబ్బతింటోంది. అభివృద్ధి అనే మాటున జరుగుతున్న ఈ విధ్వంసంపై ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం నిద్రలేవాలి. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, చెరువుల గర్భాన్ని తిరిగి పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

