మా కుటుంబాన్ని వేధించొద్దు
సుమంత్ విషయంలో వాస్తవాలను పరిశీలించండి
20 రోజులుగా మా కుటుంబంపై తీవ్ర ఒత్తిడి
ఒత్తిడి తట్టుకోలేకే మా మామయ్య ఆత్మహత్యాయత్నం
ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స జరుగుతోంది.. పరిస్థితి విషమం
సుమంత్ జీవితమే సర్వ నాశనమైంది
సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ భార్య ఆవేదన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయంలో అనేక తప్పుడు ఆరోపణలతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తుండటం బాధ కలిగిస్తోందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని మీడియాను కోరుతున్నాను. సుమంత్ వ్యవహారంలో ఒకవైపు కథనాలు వస్తున్న నేపథ్యంలో మా కుటుంబం చెప్పే మరో కోణాన్ని కూడా పరిశీలించి వార్తలు ప్రచురించాలి. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 20 రోజులుగా మా కుటుంబంపై తీవ్ర మానసిక ఒత్తిడి కొనసాగుతోంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మా మామయ్య సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాదాపు 60 నిద్రమాత్రలు మింగారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితి మా అందరికీ ఒక బ్రేకింగ్ పాయింట్గా మారింది. ఇంత టార్చర్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. సుమంత్ విషయంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాను.
ఐఐఎం చదివి.. ఓఎస్డీగా చేరారు
సుమంత్ ఐఐఎంలో చదువుకున్నారు. కార్పొరేట్ రంగంలో మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని కాదనుకుని సురేఖ ఆంటీ దగ్గర ఓఎస్డీగా చేరారు. సురేఖ, మురళి దంపతులతో ఉన్న దీర్ఘకాల స్నేహం, అభిమానంతో సేవా దృక్పథంతో ఆ బాధ్యతలు తీసుకున్నారు. కానీ కొద్ది నెలలకే సుమంత్ను సస్పెండ్ చేయడంతో ఆయన ఉద్యోగ జీవితం, కార్పొరేట్ కెరీర్ రెండూ దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎలాంటి కేసులు లేకపోయినా పోలీసులను పంపించి సుమంత్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ పరిణామాలతో మేం చాలా డిస్ట్రబ్ అయ్యాం. కేసుల వల్ల మా కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇవన్నీ మాకెందుకని తర్వాత వ్యాపారం చేసుకుంటున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. సుమంత్ జీవితం నాశనమైపోయింది.
ఫిర్యాదులో రూ.10 కోట్ల డిమాండ్ లేదు
ఆ తర్వాత సుమంత్ వ్యాపారంలోకి వచ్చారు. కొంతకాలంగా బాగానే కొనసాగుతున్న సమయంలో ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన ఫిర్యాదు కాపీ బహిరంగంగా అందుబాటులోనే ఉంది. అందులో తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని సుమంత్ ప్రశ్నించినట్లు మాత్రమే ఉంది. కానీ రూ.10 కోట్లు డిమాండ్ చేశారనే అంశం ఆ ఫిర్యాదులో లేదు. ఈ విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలి. కేసు నమోదైన తర్వాత సుమంత్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మా కుటుంబానికి ఇబ్బందులు తగ్గలేదు. కేసులో అసలు ఫిర్యాదులో ఏముందో, సుమంత్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు ఏమిటో పూర్తిగా పరిశీలించాలని మీడియాను కోరుతున్నాను.
బంధువులపైనా ఒత్తిడి
సుమంత్ విషయంలో మా బంధువుల్లో చాలామందిని పోలీసులు వేధిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నారు. ఫోన్లు చేసి సుమంత్తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తున్నారు. సుమంత్కు మద్దతుగా నిలిచిన వారిపైనా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మా డ్రైవర్ను కూడా తీసుకెళ్లిన ఘటన జరిగింది. దాంతో మేం చాలా భయపడ్డాం. ఆ పరిస్థితుల్లో మా చిన్నారిని కొంతకాలం పాఠశాలకు కూడా పంపలేకపోయాం. కొందరిపై భౌతికంగా దాడులు జరిగినట్లు కూడా మాకు తెలిసింది. ఈ పరిణామాలన్నింటితో మా కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది.
మామయ్య ఆత్మహత్యాయత్నం
గత 20 రోజులుగా మా కుటుంబంపై కొనసాగుతున్న ఒత్తిడిని ఇంతకాలం మేం భరిస్తూ వచ్చాం. సుమంత్ జీవితాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితులను, కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూడలేక మా మామయ్య సుబ్రహ్మణ్యం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరకు దాదాపు 60 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. చావుబతుకుల మధ్య ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మా మామయ్య ఈ స్థితికి చేరుకోవడం మా అందరికీ బ్రేకింగ్ పాయింట్గా మారింది. ఒక కుటుంబం ఎంత మానసిక వేదనకు గురైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.
రాజకీయాలకు దూరంగా వ్యాపారం చేసుకుంటున్నాం
మాకు ఇవన్నీ ఎందుకని రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాం. సుమంత్ కూడా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కేసులు, విచారణలు, కుటుంబ సభ్యులపై ఒత్తిడి కారణంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. సుమంత్ ఐఐఎంలో చదువుకుని కార్పొరేట్ రంగంలో మంచి జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఉన్న వ్యక్తి. సురేఖ ఆంటీ, మురళి అంకుల్తో ఉన్న స్నేహం, అభిమానంతో ఓఎస్డీగా పనిచేయడానికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆయన ఉద్యోగ జీవితం దెబ్బతింది. ఇప్పుడు కేసుల కారణంగా కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతోంది. సుమంత్ జీవితమే నాశనమైపోయింది.
వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయండి
సుమంత్పై వస్తున్న వార్తలను మాత్రమే చూసి కథనాలు ఇవ్వొద్దని మీడియాను కోరుతున్నాను. మా కుటుంబం చెప్పే మరో కోణాన్ని కూడా వినండి. కేసులో ఉన్న ఫిర్యాదును పరిశీలించండి. అందులో ఏముందో చూడండి. సుమంత్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాతే వార్తలు ఇవ్వండి. మీడియా, సామాజిక మాధ్యమాల ప్రతినిధులకు నా ఒక్కటే విజ్ఞప్తి.. వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయండి. ఒక కుటుంబం ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. మా మామయ్య చావుబతుకుల మధ్య ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసంపూర్ణ సమాచారంతో మరింత ఒత్తిడి పెంచవద్దు. సుమంత్ విషయంలో మరో కోణాన్ని కూడా విని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను.

