దొంతి దిష్టిబొమ్మతో శవయాత్ర
పెద్ది విగ్రహ నిర్మాణం కూల్చివేతపై బీఆర్ఎస్ భగ్గు
కాంగ్రెస్ తీరుపై ఆకుల శ్రీనివాస్ మండిపాటు
నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
కాకతీయ, నర్సంపేట టౌన్: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళవారం తొగర్రాయిలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం కోసం చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాసేవ చేసిన దివంగత నేతను అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన పెద్ది జ్ఞాపకాలను నిర్మాణాలు కూల్చడం ద్వారా చెరిపేయలేరని స్పష్టం చేశారు.
అభిమానాన్ని కూల్చలేరు
‘‘నిర్మాణాన్ని కూల్చగలరేమో.. పెద్ది సుదర్శన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మాత్రం కూల్చలేరు’’ అని శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం తగదన్నారు. విగ్రహ నిర్మాణం కూల్చివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన ప్రజాసేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి మహేందర్, బొల్లం అనిల్, పొగాకు ప్రేమ్కుమార్, బుక్క సునీల్, హనుమకొండ అనిల్, అన్న లక్ష్మణ్, రాసరాజు, గొర్రె రాంబాబు, పెంతల మహేష్, పెంతల గణేష్, అమ్మిరెడ్డి రాజు, జట్టబోయిన రాజు, తుమ్మలపల్లి శ్రీనివాస్, కస్తూరి రాజు, హనుమకొండ బాబు, చిలువేరు సుమన్, హనుమకొండ ప్రభాకర్, హర్షం చిరంజీవి, చిలువేరు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

