కాకతీయ ఎఫెక్ట్..
కదిలిన పంచాయతీ యంత్రాంగం
రహదారుల వెంట చెత్త కుప్పల తొలగింపు
వీధుల్లో దోమల నివారణకు ముమ్మరంగా ఫాగింగ్
డ్రైనేజీల్లో పూడికతీత.. ఇంటింటికీ చెత్త సేకరణకు చర్యలు
స్పందించిన అధికారులకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు

కాకతీయ, రాయపర్తి : మండల కేంద్రంలో పారిశుద్ధ్య లోపాలు, రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్త, దోమల బెడదపై ‘కాకతీయ’లో ప్రచురితమైన కథనంతో పంచాయతీ యంత్రాంగం కదిలింది. ఆగస్టు 6న ‘పారిశుద్ధ్యం గాలికి.. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి యాకూబ్ నాయక్ స్పందించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారితో పాటు పలు వీధుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, చెత్తను ట్రాక్టర్లతో తొలగించారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామంలోని వీధుల్లో ఫాగింగ్ నిర్వహించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

సమస్యపై స్పందించిన ‘కాకతీయ’
తమ సమస్యను పత్రికా ముఖంగా వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘కాకతీయ’కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా పత్రిక దృష్టికి తీసుకెళ్తే అధికారుల్లో కదలిక వస్తుందనే నమ్మకం మరింత బలపడిందని వారు పేర్కొన్నారు.


