మాజీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు వాస్తవాలు అంగీకరించాలి
గత ప్రభుత్వంలో వదిలేసిన పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్నాం
పరకాల అభివృద్ధికి రూ.484 కోట్లకు పైగా నిధులు
బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
కాకతీయ, హనుమకొండ : ప్రజల విశ్వాసం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలను అంగీకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండలోని డీసీసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు. పరకాల 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి దాదాపు రూ.35 కోట్ల వ్యయం కాగా, గత ప్రభుత్వం కేవలం రూ.6.19 కోట్లు విడుదల చేయడంతో పనులు 16 నెలలు నిలిచిపోయాయని రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చొరవ, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మిగిలిన నిధులు విడుదల చేయించి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేసిన పనులను పూర్తి చేయడం నేరమా అని ప్రశ్నించారు.
రూ.484 కోట్లకు పైగా అభివృద్ధి పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరకాల నియోజకవర్గంలో రూ.484 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి అమలు చేస్తున్నామని తెలిపారు. పరకాల పట్టణానికి శాశ్వత మంచినీటి సౌకర్యం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా డెయిరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. పరకాల నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే శంకుస్థాపన చేసి ప్రారంభించిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆయన స్వగ్రామం అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ సెంటిమెంట్తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తామే చేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

