కాకతీయ ఎఫెక్ట్.. కదిలిన జిల్లా యంత్రాంగం
రాయపర్తి పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ కథనానికి తక్షణ స్పందన
అపరిశుభ్రతపై ఆగ్రహం.. 24/7 వైద్యం అందాల్సిందే
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాకతీయ, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆగస్టు 22న ‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ల్యాబొరేటరీ నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో రోగులకు 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాయంత్రం వేళల్లో ఆసుపత్రి మూసివేతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ల్యాబొరేటరీని పరిశీలించి అక్కడి వైద్య సామగ్రి, నిర్వహణపై ఇన్చార్జిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మందుల నిల్వల పరిశీలన
మందుల నిల్వలను పరిశీలించిన కలెక్టర్ గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు. మందులను నిబంధనల ప్రకారం సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను కలెక్టర్ సందర్శించారు. చిన్నారులకు నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్, మండల వైద్య అధికారి అరుణ్ చంద్ర, స్థానిక సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


