కాశిబుగ్గలో ‘కలెక్షన్’ రాజ్యం!
అక్రమ నిర్మాణాలే టార్గెట్గా వసూళ్ల ఆరోపణలు
డీసీ ప్రసన్నరాణి తీరుపై ఉద్యోగ వర్గాల్లో చర్చ
సర్వే నంబర్ వివాదంతో మరింత ముదిరిన ఆరోపణలు
డీసీ ప్రసన్నరాణిపై విచారణ ఎప్పుడో?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) కాశిబుగ్గ సర్కిల్లో ‘కలెక్షన్’ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణికి అనుకూలంగా వ్యవహరించే కొందరు ఉద్యోగులు అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం బల్దియా ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది. రోజువారీగా వసూలైన మొత్తాలు మధ్యాహ్న సమయానికే కార్యాలయానికి చేరుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
కాశిబుగ్గ కేంద్రంగా ‘కలెక్షన్’?
ప్రసన్నరాణి కాశిబుగ్గ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు, అనుమతులు లేకుండా చేపడుతున్న పనులను కొందరు ఉద్యోగులు గుర్తించి.. సంబంధిత యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీసీకి అనుకూలంగా ఉన్న నలుగురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి నయానో.. భయానో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వసూళ్ల అనంతరం నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాశిబుగ్గ సర్కిల్లో జరుగుతున్న వసూళ్ల వ్యవహారంపై బల్దియా ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో తిరిగే ఉద్యోగులు వసూలు చేసిన మొత్తాన్ని మధ్యాహ్నానికి కార్యాలయానికి తీసుకువస్తారని.. ఆ తర్వాత ఆ డబ్బును డీసీ తన వెంట తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బహిర్గతం కాలేదు. ఆరోపణలు నిజమా? కాదా? తేల్చేందుకు సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులు, జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యలు, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎన్ని నిర్మాణాలు నిలిపివేశారు? ఎన్ని కూల్చివేశారు? ఎన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి? అనే వివరాలను పరిశీలిస్తే ఆరోపణల్లో వాస్తవమెంతో తేలే అవకాశం ఉంది. చర్యలు తీసుకున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ క్షేత్రస్థాయిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయా? అనే అంశంపైనా విచారణ జరగాల్సి ఉంది.
సర్వే నంబర్ వివాదంతో మరిన్ని అనుమానాలు
ఇటీవల కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్న సర్వే నంబర్ మార్పు వ్యవహారం కూడా డీసీ ప్రసన్నరాణి తీరుపై అనుమానాలకు తావిచ్చింది. ఒకరి ఆధీనంలో ఉన్న స్థలానికి సంబంధించిన సర్వే నంబర్ను మరో వ్యక్తికి సంబంధించినదిగా పేర్కొంటూ ఇంటి నంబర్ వ్యవహారంలో నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పటికే వెలువడ్డాయి. బాధితులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో అధికారులు స్థలాన్ని పరిశీలించి ఒక సర్వే నంబర్ సరైనదని, మరో సర్వే నంబర్ తప్పని తేల్చినట్లు బాధితులు చెబుతున్నారు. అయినప్పటికీ తాజాగా భిన్నమైన నిర్ణయం ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకరి స్థలానికి సంబంధించిన రికార్డుల్లో మార్పులు ఎలా చోటుచేసుకున్నాయి? ఇంటి నంబర్ కేటాయింపు సమయంలో ఏ పత్రాలను పరిశీలించారు? గతంలో రద్దు చేసిన ఇంటి నంబర్ను తిరిగి ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? అనే అంశాలపై సమగ్ర విచారణ అవసరమవుతోంది.
‘అది 624.. 527గా ఎలా మారింది?’
ఈ వివాదంలో ఏడీ స్థాయి సర్వే నిర్వహించి స్థలం సర్వే నంబర్ 624/1/2కు సంబంధించినదిగా తేల్చినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఈ నెల 14న సర్వే నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు కూడా ఇదే స్థలానికి సంబంధించి అధికారులు విచారణ జరిపి 624/1/2 సరైన సర్వే నంబర్గా, 527/బి తప్పుగా గుర్తించినట్లు బాధితుల వాదన. అయితే ఇప్పుడు అదే స్థలాన్ని 527/బిగా పేర్కొంటూ నిర్ణయం ఎలా తీసుకున్నారన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. సర్వే నంబర్ మార్పునకు ఆధారమైన పత్రాలు ఏమిటి? ఆ మార్పును ఎవరు ప్రతిపాదించారు? ఎవరు ఆమోదించారు? ఏ అధికారి సంతకం చేశారు? అనే వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రికార్డులన్నింటినీ పరిశీలిస్తే అసలు సర్వే నంబర్ ఏదో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
సర్వే అధికారిపై ఒత్తిడి తెచ్చారా?
ఈ వివాదంలో ఏడీ సర్వే అనంతరం సర్వే అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా బల్దియా వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే కారణంగా డీసీ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందంటూ సదరు అధికారితో వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. స్థలం తమదేనని భావిస్తే సర్వే ఫలితాలను చట్టపరంగా సవాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. సర్వే అధికారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఎందుకు జరిగాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు సర్వే నివేదికలో ఏముంది? దాని ఆధారంగా తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అనే అంశాలను అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. బల్దియాలో అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు కొత్తేమీ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసిన వ్యవహారంలోనూ చర్యల విషయంలో జాప్యం జరిగిందనే విమర్శలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడం బల్దియా ఉన్నతాధికారులకు సవాల్గా మారింది. చిన్నస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలోనూ వెనుకడుగు వేస్తున్నారనే విమర్శల మధ్య.. ఉన్నతస్థాయి అధికారిపై వచ్చిన ఆరోపణలను ఎంత సీరియస్గా తీసుకుంటారన్నదే ప్రశ్నగా మారింది.
ఆరోపణలు నిజమా.. నిరాధారమా?
డీసీ ప్రసన్నరాణిపై వస్తున్న ఆరోపణలు నిజమా? లేక వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో చేస్తున్నవా? అనేది విచారణతో తేలాల్సి ఉంది. కాశిబుగ్గ సర్కిల్లో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలపై జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యలు, పెండింగ్ ఫైళ్లు, ఇంటి నంబర్ల కేటాయింపులు, సర్వే నంబర్ మార్పులకు సంబంధించిన రికార్డులను ఉన్నతాధికారులు పరిశీలిస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. అలాగే సర్వే నంబర్ 624/1/2, 527/బికి సంబంధించిన పాత, ప్రస్తుత రెవెన్యూ రికార్డులు.. ఇంటి నంబర్ కేటాయింపు ఫైళ్లు.. సర్వే నివేదికలు.. అధికారుల ఉత్తర్వులను బహిరంగంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిరాధారమైతే సంబంధిత అధికారులు స్పష్టమైన ఆధారాలతో వాటిని ఖండించాలి. ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బల్దియా పాలనపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టాలంటే.. అధికారులపై వచ్చే ఆరోపణలకు సమాధానం రికార్డులతోనే ఇవ్వాలి. కాశిబుగ్గలో సాగుతున్న ‘కలెక్షన్’ ఆరోపణలతో పాటు సర్వే నంబర్ వివాదంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

