ఆరు గ్యారంటీల అమలేది..?
వంద రోజుల్లో అన్నారు.. వెయ్యి రోజులైనా నెరవేర్చలేదు
తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు
కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది
రుణమాఫీ, రైతుబంధు అమలులోనూ మోసమే
భూభారతి పేరుతో రైతుల భూములపై ఆంక్షలు
కాంగ్రెస్ను గద్దె దించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజం
కాకతీయ, జనగామ: తెలంగాణ సాధించుకున్నది రాష్ట్ర ప్రజలు, రైతులు బాగుపడటం కోసమేనని, కానీ సీఎం రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబునాయుడికి తెలంగాణను తాకట్టు పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం చేస్తూ రాష్ట్ర రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుండా అక్కడికి వెళ్లి లేనిపోని మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపడుతున్న పోరాటంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిందని పల్లా రాజేశ్వర్రెడ్డి గుర్తుచేశారు. అయితే వెయ్యి రోజులు పూర్తయినా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరో రెండేళ్లు అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు.
రైతులు, నిరుద్యోగులను మోసం చేశారు
రుణమాఫీ, రైతుబంధు రెండు పథకాలను ఎగ్గొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పల్లా ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించామని, ప్రస్తుత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్రంతో దోస్తీ చేస్తూ, తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. భూభారతి పేరుతో 22 రకాల నిషేధిత జాబితాలను ఏర్పాటు చేసి ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ముందు పెట్టి నిర్వహిస్తూ రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని విమర్శించారు.
గద్దె దించే వరకు పోరాటం
తెలంగాణ నీళ్లు, రైతుల హక్కులు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు, ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తేల్చిచెప్పారు.

