మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు స్వాహా..!
వేతనాల చెల్లింపుల్లో అవకతవకలపై విచారణ చేయాలి
మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
మల్టీపర్పస్ వర్కర్ల డిమాండ్
కాకతీయ, నల్లబెల్లి: మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని, తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 11 మంది కార్మికుల వేతనాల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ధర్మేందర్ హయాంలో మూడు నెలల వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో ఉంచారని ఆరోపించారు. కొందరికి ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి వేతనాలు ఇవ్వకుండా కోతలు విధించారని, ఆ మొత్తాలు ఎక్కడికి వెళ్లాయో తేల్చాలని కోరారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అవకతవకలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై అధికారులు, మాజీ పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ వివరణ తెలియాల్సి ఉంది.

