హన్మకొండ చౌరస్తా రీడెవలప్మెంట్
పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చూస్తున్నాం
అశోక హోటల్ ఎదురుగా త్వరలోనే మల్టీలెవల్ పార్కింగ్
అండర్ డ్రైనేజీ, వాటర్ వర్క్స్ పనుల ప్రక్రియ మొదలైంది
వచ్చే 40 ఏళ్లకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం
భద్రకాళి, వరంగల్ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి
డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి
నగరం పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతోంది. కాలనీలు విస్తరిస్తున్నాయి. కానీ మౌలిక వసతులు మాత్రం అదే స్థాయిలో ఉంటే సమస్యలు తప్పవు. ఈ నేపథ్యంలో హన్మకొండ నగరానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని హన్మకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ ఐఏఎస్ చాహత్ బాజ్పేయి తెలిపారు. పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం, హన్మకొండ చౌరస్తా రీడెవలప్మెంట్, అండర్ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా బలోపేతం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. అశోక హోటల్ ఎదురుగా ఉన్న కుడా స్థలంలో మల్టీలెవల్ పార్కింగ్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ముందుభాగంలో వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుకునేలా రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. మంగళవారం తన చాంబర్లో డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో జిల్లా, నగర అభివృద్ధి పనులపై ఆమె వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే..!

అశోక హోటల్ వద్ద మల్టీలెవల్ పార్కింగ్
హన్మకొండలో ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపైనే వాహనాలను నిలిపివేయాల్సి రావడంతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీనికి పరిష్కారంగా అశోక హోటల్కు ఎదురుగా ఉన్న కుడా స్థలంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాం. పార్కింగ్ నిర్మాణానికి మాత్రమే స్థలాన్ని పరిమితం చేయకుండా, ముందుభాగంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసి లీజుకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. వాణిజ్య సముదాయం ద్వారా ఆదాయం సమకూర్చుకుని పార్కింగ్ నిర్వహణకు వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. నగరంలోని కీలక ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు వ్యాపారులకు, ప్రజలకు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు అమలైతే హన్మకొండలో పార్కింగ్ సమస్యకు కొంతవరకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.

హన్మకొండ చౌరస్తాకు కొత్త రూపం
హన్మకొండ చౌరస్తాను సమగ్రంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీ బస్స్టేషన్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కలుపుకొని ప్లాజా తరహా అభివృద్ధి చేపట్టే అంశంపై ఆర్టీసీ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రతిపాదనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ దృష్టికి తీసుకెళ్లాం. చౌరస్తా అభివృద్ధిలో రవాణా సౌకర్యాలు, పార్కింగ్, పాదచారుల కదలిక, వాణిజ్య వసతులు వంటి అంశాలను సమన్వయం చేయనున్నాం. హన్మకొండ చౌరస్తా నగరానికి ప్రధాన ప్రవేశ ప్రాంతంగా ఉన్నందున దాని రూపురేఖలు మార్చాల్సిన అవసరం ఉంది. మల్టీలెవల్ పార్కింగ్, ప్లాజా నిర్మాణం వంటి పనులు పూర్తయితే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు చౌరస్తాకు కొత్త ఆకర్షణ వస్తుంది.

అండర్ డ్రైనేజీకి రూ.5 వేల కోట్ల ప్రణాళిక
హన్మకొండ, కాజీపేట, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు భారీ ప్రాజెక్టును చేపడుతున్నాం. సుమారు రూ.5 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాం. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియలో భాగంగా దాదాపు 10 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తాం. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అండర్ డ్రైనేజీ వ్యవస్థను రూపొందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందని, సంబంధిత అధికారులు తదుపరి ప్రక్రియపై పరిశీలన చేస్తున్నారు. ముంపు సమస్యకు తరచూ గురయ్యే ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

తాగునీటి సరఫరాకు రూ.500 కోట్లు
గ్రేటర్ వరంగల్ వాటర్ వర్క్స్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయనున్నాం. కొత్త పైపులైన్ల నిర్మాణం, పాత పైపులైన్ల మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థ విస్తరణ, కొత్త వాటర్ ట్యాంకులు, వాటర్ ప్లాట్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నాం. నగరంలోని ప్రస్తుత అవసరాలను మాత్రమే కాకుండా 30 నుంచి 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కాలనీల విస్తరణకు అనుగుణంగా నీటి సరఫరా పెంచడం, చివరి ప్రాంతాలకూ తాగునీరు అందించడం, పాత పైపులైన్ల వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడం ఈ పనుల్లో ప్రధాన భాగమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
భద్రకాళి, వరంగల్ కోటకు పర్యాటక హంగులు
భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.90 కోట్ల ఎస్డీపీ నిధులు కేటాయించింది. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులు కొనసాగుతున్నాయి. భద్రకాళి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయనున్నాం. భద్రకాళి బండ్ వద్ద పెండింగ్లో ఉన్న స్టోన్ వర్క్ పనులకు రూ.19 కోట్లతో టెండర్లు పిలిచాం. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులను ఆయనకు చూపించే ఆలోచన ఉంది. వరంగల్ కోట చుట్టూ ఉన్న సుమారు 4 కిలోమీటర్ల రక్షణ కందకాన్ని పునరుద్ధరించి బోటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఖిలా వరంగల్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకుంటున్నాం. నగరంలో ముంపు సమస్యను తగ్గించేందుకు రిటర్న్ వాల్, డ్రైనేజీలు, నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం. చారిత్రక కట్టడాలు, ఆలయాలు, సహజసిద్ధమైన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం.
దేవునూరు గుట్టలకు పర్యాటక శోభ
ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గుట్టలను అటవీశాఖ సహకారంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉంది. ధర్మసాగర్ రిజర్వాయర్, అటవీ విస్తీర్ణం, సహజసిద్ధమైన గుట్టలను కలుపుకొని అభివృద్ధి చేస్తే ప్రజలకు ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వస్తుంది. దీనిపై గతంలోనే ప్రతిపాదనలు రూపొందించామని, ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తున్నాం. రహదారులు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందిస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇళ్లతో పాటు మౌలిక వసతులపైనా దృష్టి
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ వందశాతం పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని లబ్ధిదారులు దృష్టికి తీసుకొస్తున్నారు. అంబేద్కర్నగర్లోని డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలిచారు. త్వరలో పనులు పూర్తవుతాయి. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై ఆక్యుపెన్సీ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాం. అర్హులైన వారు ఇళ్లను వినియోగించుకునేలా చూడటమే ఈ ప్రక్రియ ఉద్దేశం. ఇళ్ల నిర్మాణంతో పాటు నీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
బయోమైనింగ్తో చెత్త సమస్యకు పరిష్కారం
నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శానిటేషన్ క్లియరెన్స్ను సవాల్గా తీసుకుని పనిచేస్తున్నాం. చెత్తను యథేచ్ఛగా డంపింగ్ చేయకుండా బయోమైనింగ్, బయో సీఎజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఉన్న వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసే విధానాలను అమలు చేయనున్నాం. డంపింగ్ యార్డు విషయంలో కొత్తగా వెతుకులాట చేయడం లేదని, అందుబాటులో ఉన్న వ్యవస్థను సమర్థంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. నగర పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా చర్యలు
ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బూత్ లెవల్ అధికారులు ప్రజలకు వివరాలు తెలియజేస్తున్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నాం.
ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో సివిల్స్లోకి
మధ్యప్రదేశ్లోని గుణలో టెన్త్ వరకు చదువుకున్నానని చాహత్ బాజ్పేయి తెలిపారు. ఇంటర్ విద్యను గ్వాలియర్లో పూర్తి చేశానని, 2016లో ఐఐటీ కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానని చెప్పారు. తన తండ్రి ఇంజనీరింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారని, ఉన్నతాధికారులతో ఆయనకు ఉన్న పరిచయాలు, కలెక్టర్ స్థాయి బాధ్యతల గురించి చెప్పే విధానం తనపై ప్రభావం చూపిందన్నారు. ప్రజలకు విస్తృతంగా సేవ చేసే అవకాశం సివిల్ సర్వీసుల్లో ఉంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేశానని తెలిపారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే తొలిసారి సివిల్స్ పరీక్ష రాశానని, మూడో ప్రయత్నంలో విజయం సాధించానని చెప్పారు. సివిల్స్ శిక్షణ సమయంలోనే తన భర్త ఐఏఎస్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని నవ్వుతూ తెలిపారు.
ఉత్తరం కాకతీయ ఎడిటర్
కిరణ్ గౌడ్ అరెల్లి
-7396604266

