లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలి
అర్హులకు సకాలంలో ప్రభుత్వ సహాయం అందించాలి
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశం
కాకతీయ, ములుగు ప్రతినిధి : లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలపై చర్చించారు. పెండింగ్ అంశాలను పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. దరఖాస్తులు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జీ, ములుగు డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు రామ్మోహన్, రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

