గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం
ఉత్తర్వులు రాకముందే నియామకం జరిగిందా?
అర్హుల దరఖాస్తులు స్వీకరించని వరంగల్ డీఐఈఓ కార్యాలయం
స్థానికుడిని కాదని జనగామ అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నారా?
డీఐఈఓకు దేవేందర్ ఫిర్యాదు..
న్యాయం జరగకపోతే కమిషనర్ను కలుస్తానని వెల్లడి
కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా? అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించకుండానే పోస్టులు భర్తీ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు భర్తీ వ్యవహారంపై స్థానిక అభ్యర్థి టి. దేవేందర్ జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ)కు ఫిర్యాదు చేశారు. ఉత్తర్వులు వెలువడకముందే ఓ వ్యక్తిని విధుల్లోకి తీసుకున్నారని, తన దరఖాస్తును స్వీకరించలేదని ఆయన పేర్కొన్నారు. 2026–2027 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ ఈ నెల 7న Rc. No. CIE-SIIB/GAPB/1/2024-SER-II ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాయపర్తి కళాశాలలో జంతుశాస్త్ర విభాగానికి ఓ వ్యక్తిని అంతకుముందే చేర్చుకుని గత 15 రోజులుగా విధుల్లో కొనసాగిస్తున్నట్లు సమాచారం. అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే నియామకం ఎలా జరిగింది? ఆ వ్యక్తిని విధుల్లోకి తీసుకునేందుకు ఎవరు అనుమతించారు? అన్నది తేలాల్సి ఉంది.
దరఖాస్తు తీసుకోలేదంటున్న దేవేందర్
రాయపర్తి కళాశాలలోని ఖాళీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో వరంగల్ డీఐఈఓ కార్యాలయానికి వెళ్లినట్లు దేవేందర్ తెలిపారు. అయితే తన దరఖాస్తును సిబ్బంది స్వీకరించలేదని, ‘‘ఇప్పటికే అక్కడ ఒకరు 15 రోజులుగా పనిచేస్తున్నారు.. వారినే కొనసాగిస్తాం.. మీరు రావాల్సిన అవసరం లేదు’’ అని చెప్పి వెనక్కి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా ముందుగానే ఒకరిని కొనసాగించడం ఏ నిబంధనల కిందకు వస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్థానికతకు ప్రాధాన్యం లేదా?
గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలో స్థానికతతో పాటు విద్యార్హతల్లో ఉత్తీర్ణత శాతం, గతంలో పనిచేసిన బోధనానుభవం, విద్యార్థుల ఫలితాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తనకు అర్హతలు, గత అనుభవం ఉన్నప్పటికీ వరంగల్ స్థానికుడైన తనను పక్కనపెట్టి మల్టీజోన్–2 పరిధిలోని జనగామ జిల్లాకు చెందిన అభ్యర్థికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని దేవేందర్ పేర్కొన్నారు. స్థానికత, మెరిట్, అనుభవం పరిశీలించకుండానే ఎంపిక నిర్ణయం తీసుకున్నారా? పైరవీలకు ప్రాధాన్యం ఇచ్చారా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
న్యాయం జరగకపోతే కమిషనర్కు ఫిర్యాదు
తన దరఖాస్తును స్వీకరించి అర్హతలను పరిశీలించాలని దేవేందర్ డీఐఈఓను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే మల్టీజోన్–1 ఆర్జేడీ, హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఉత్తర్వులు రాకముందే విధుల్లోకి తీసుకున్న వ్యక్తి అర్హతలు, నియామకానికి సంబంధించిన రికార్డులు, దరఖాస్తుల స్వీకరణ వివరాలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరుతున్నారు.

