ఎమ్మెల్యే రేవూరి వర్సెస్ కౌన్సిలర్లు
పరకాల మునిసిపాలిటీలో అధికార పార్టీ అసమ్మతి సెగలు
కౌన్సిల్ సమావేశానికి దూరంగా 7 మంది కౌన్సిలర్లు
కోరం లేక అధికార పక్షానికి ఇబ్బందులు.. ఎమ్మెల్యే రేవూరికి గ్యాప్
ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కౌన్సిలర్ల నారాజ్
హైదరాబాద్కు పిలిపించి సముదాయించినా.. కుదరని నమ్మకం
పైకి కూల్.. లోపల కుతకుత.. పనులపై విజిలెన్స్కు బీఆర్ఎస్ నేత ఫిర్యాదు?!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పరకాల మునిసిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి, అధికార పార్టీ కౌన్సిలర్లకు మధ్య గ్యాప్ ఏర్పడిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మునిసిపాలిటీలో కౌన్సిలర్ల మధ్య కూడా విభేదాలు ముదురుతున్నట్లు సమాచారం. పైకి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం అసంతృప్తి అగ్గి రాజుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశానికి అధికార పార్టీకి చెందిన 7 మంది కౌన్సిలర్లు దూరంగా ఉండటం ఈ విభేదాలకు బహిరంగ సంకేతంగా మారింది. అధికార పక్షానికి చెందిన సభ్యులే సమావేశానికి హాజరుకాకపోవడంతో కోరం లేక ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే రేవూరికి, కౌన్సిలర్లకు మధ్య సమన్వయం ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే రేవూరికి కౌన్సిలర్లకు మధ్య పెరిగిన దూరం
పరకాల మునిసిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వార్డుల అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, కాంట్రాక్టుల వ్యవహారం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని పలువురు కౌన్సిలర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమను పక్కనపెట్టి.. కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం వారిలో బలపడినట్లు తెలుస్తోంది. మునిసిపాలిటీలో నిర్ణయాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయా? కౌన్సిలర్లను కేవలం సమావేశాలకు పరిమితం చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది. ప్రజల నుంచి ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు పనులు, అధికారిక గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యం లేకపోతే పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలన్న ప్రశ్న వారిలో తలెత్తినట్లు సమాచారం.
కౌన్సిల్ మీటింగ్కు దూరంగా 7 మంది
ఇటీవల జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి అధికార పార్టీకి చెందిన 7 మంది కౌన్సిలర్లు గైర్హాజరు కావడం పరకాల రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రతిపక్ష సభ్యులు దూరంగా ఉండటం ఒక ఎత్తయితే.. అధికార పార్టీ కౌన్సిలర్లే సమావేశానికి రాకపోవడం మరో ఎత్తుగా మారింది. కోరం లేక సమావేశం నిర్వహణపై ఇబ్బందులు ఏర్పడటంతో అధికార పక్షం ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం వెనుక వ్యక్తిగత కారణాలా? లేక ఎమ్మెల్యే రేవూరి తీరుపై అసంతృప్తితో ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ల గైర్హాజరును సాధారణ విషయంగా కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఒకేసారి దూరంగా ఉండటం వెనుక అంతర్గత విభేదాలే కారణమన్న ప్రచారం జోరందుకుంది. కౌన్సిలర్ల మధ్య నెలకొన్న అసమ్మతి ఇప్పుడు మునిసిపల్ పాలనపైనా ప్రభావం చూపే పరిస్థితికి చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“పనులన్నీ మీరే చేసుకుంటే.. మేం ఏం కావాలి?”
కౌన్సిలర్లను సముదాయించేందుకు కాంగ్రెస్కు చెందిన ఓ ముఖ్యనేత రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్కు పిలిపించి మరీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు తమ అసంతృప్తిని దాచుకోకుండా నేరుగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. “ఉన్న పనులన్నీ మీరే చేసుకుంటే మేం ఏం కావాలి?”, “చైర్మన్ సంగతిని ఆయన చూసుకుంటే.. మరి మా గతేం కాను?”, “మమ్మల్ని పట్టించుకోకుంటే మేం ఎందుకు సపోర్ట్ చేయాలి?” అంటూ ముఖ్యనేతను నిలదీసినట్లు తెలుస్తోంది. మునిసిపాలిటీలో పనులన్నీ కొందరి చుట్టూనే తిరుగుతున్నాయని, తమ వార్డులకు నిధులు, పనులు, ప్రాధాన్యం దక్కడం లేదని కౌన్సిలర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చినా తమ రాజకీయ భవిష్యత్తు, వార్డు ప్రజల ముందు తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ల మాటల్లో అసంతృప్తి మాత్రమే కాకుండా.. తమను పక్కనపెడుతున్నారన్న ఆవేదన కూడా వ్యక్తమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
న్యాయం చేస్తానని హామీలు.. ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా
పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యనేత కౌన్సిలర్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇకపై అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని, వార్డుల సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆర్థికంగా కూడా ఆదుకుంటానని భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే గతంలో ఇచ్చిన హామీలు అమలుకాలేదన్న భావనతో కౌన్సిలర్లు ఈసారి మాటలను పూర్తిగా నమ్మలేదని తెలుస్తోంది. చర్చల అనంతరం పరిస్థితి తాత్కాలికంగా చల్లబడినట్లు కనిపిస్తున్నా.. అసమ్మతి పూర్తిగా తొలగిపోలేదన్న ప్రచారం కొనసాగుతోంది. హామీలతో కౌన్సిలర్లను సముదాయించవచ్చా? లేక మునిసిపాలిటీలో అధికార పంపకాలు, పనుల కేటాయింపు, రాజకీయ ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాల్సిందేనా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మాటలతో మంట ఆరినట్లు కనిపించినా.. లోపల బూడిద కింద నిప్పులు మిగిలే ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పైకి అంతా ఓకే.. లోపల మాత్రం కుతకుత
పరకాల మునిసిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి రాజేస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి, కౌన్సిలర్లకు మధ్య ఏర్పడిన గ్యాప్ ఈ విభేదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కౌన్సిలర్ల మధ్య కూడా ఎవరి వర్గం వారు అన్న పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే ప్రాధాన్యం దక్కడం, మరికొందరిని పట్టించుకోకపోవడం వల్ల అంతర్గత అసంతృప్తి పెరుగుతున్నట్లు సమాచారం. మునిసిపల్ చైర్మన్ వ్యవహారాలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, కాంట్రాక్టుల కేటాయింపు వంటి అంశాలు కూడా విభేదాలకు ఆజ్యం పోస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఏకతాటిపై ఉండాల్సిన సమయంలో.. ఒకరిపై ఒకరు అసంతృప్తితో ఉండటం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పైకి అంతా కూల్గా వ్యవహరిస్తున్నా.. లోపల మాత్రం కుతకుత కొనసాగుతోందని తెలుస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో విభేదాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
మునిసిపల్ పనులపై విజిలెన్స్కు బీఆర్ఎస్ నేత ఫిర్యాదు?!
ఇదిలా ఉండగా పరకాల మునిసిపాలిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై బీఆర్ఎస్కు చెందిన ఓ నేత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పనుల నాణ్యత, అంచనా వ్యయం, పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు, కాంట్రాక్టర్ల ఎంపిక తదితర అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మునిసిపాలిటీలో జరుగుతున్న పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు, టెండర్ ప్రక్రియ, కొలతల పుస్తకాలు, బిల్లుల వివరాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. విజిలెన్స్కు ఫిర్యాదు అందిందా? అందితే ఏ అంశాలపై విచారణ చేపట్టారు? పనుల రికార్డులు స్వాధీనం చేసుకున్నారా? నాణ్యతపై తనిఖీలు జరిగాయా? అన్న వివరాలు వెల్లడికావాల్సి ఉంది. అధికార పార్టీలో కౌన్సిలర్ల అసమ్మతి ఒకవైపు.. మునిసిపల్ పనులపై విజిలెన్స్ ఫిర్యాదు మరోవైపు ఉండటంతో పరకాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే రేవూరి ఈ విభేదాలకు ఎప్పుడు తెరదించుతారు? కౌన్సిలర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించి పార్టీని ఏకతాటిపైకి తీసుకువస్తారా? లేక అసమ్మతి మరింత ముదిరి మునిసిపల్ పాలనను ప్రభావితం చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

