మా వాటా మాకివ్వండి
రాజ్యాధికారం సాధనే బీసీల అభివృద్ధికి మార్గం
జనరల్ సీటు అంటే ఓసీలే పోటీకి నిలబడాలా..?
జనరల్ సీట్లు అందరివీ.. ఒక్క వర్గానికే ఎందుకు?
ఓసీలకు నోట్ల బలం ఉంటే.. బీసీలకు ఓట్ల బలం ఉంది
ఆ బలాన్ని గుర్తించి ఐక్యంగా పోరాడితేనే సత్ఫలితం
బీసీలకు జరుగుతున్న దగాపై ఐక్య పోరాటాలతో ముందుకెళ్లాలి
బీసీ నినాదంపై ఏ రూపంలో అయినా సప్పుడైతే మంచిదే
ఇప్పుడు మార్పునకు అడుగులు పడుతున్నాయి.. పార్టీల్లో ఆ భయం మొదలైంది
వరంగల్ జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బీసీల పవర్ చూపుతాం
అక్టోబర్లో పరకాలలో బీసీల బహిరంగ సభ పెడుతున్నాం
ఉమ్మడి వరంగల్లో మొత్తం 8 సభలకు ప్లాన్ చేశాం
బీసీలను ఏకం చేస్తాం.. బీసీ లీడర్లు ఏ పార్టీలో ఉన్నా ఎంకరేజ్ చేస్తాం
ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్
‘‘బీసీలకు స్కీంలు కాదు.. రాజకీయంగా సీట్లు కావాలి. రాజకీయంగా నిలబడితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం సాధించడమే బీసీల అభివృద్ధికి మార్గం. బీసీలకు రావాల్సిన రాజకీయ వాటా దక్కే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. బీసీలకు జరుగుతున్న దగాపై ఐక్య పోరాటాలతో ముందుకు సాగాల్సిందే’’ అని ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు.జనరల్ సీటు అంటే ఓసీలకు కేటాయించబడిన సీట్లన్న భావన అన్ని పార్టీల్లో నెలకొని ఉండటం దురదృష్టకరం. జనరల్ సీట్లు అందరివీ అయినప్పుడు ఒక్క వర్గానికే ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఓసీలకు నోట్ల బలం ఉంటే.. బీసీలకు ఓట్ల బలం ఉంది. ఆ బలాన్ని గుర్తించి బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే సత్ఫలితం వస్తుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగాలు, వరంగల్ అభివృద్ధి, తన రాజకీయ ప్రస్థానంపై ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..!!

బీసీలకు రాజకీయ న్యాయం జరిగే వరకూ ఉద్యమం
‘‘బీసీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే సామాజిక న్యాయం కాదు. రాజకీయ అధికారంలో వాటా ఇవ్వాలి. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. రాజకీయ పార్టీల్లో పదవులు ఇవ్వాలి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పించాలి. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికల్లో పార్టీలకు బీసీల ఓట్లు కావాలి గాని.. సీట్ల కేటాయింపు విషయంలో మాత్రం బీసీలను పక్కన పెట్టే విధానం కొనసాగుతోంది. ఈ పరిస్థితి మారాలి. బీసీల్లో చైతన్యం పెరిగినప్పుడే రాజకీయ పార్టీలకు చచ్చినట్లుగా బీసీ వాదానికి తప్పక తలొగ్గుతాయి. మొత్తం జనాభాలో బీసీలకు 50 శాతంపైబడి ఉన్నారు. మరి రాజకీయంగా అంతే స్థాయిలో సీట్లు కోరుకోవడం తప్పేలా అవుతుంది. పార్టీలన్నీ బీసీల ఓట్లను కోరుకుంటున్నాయి. కానీ సీట్లు ఇచ్చే విషయంలో మాత్రం వెనుకంజ వేస్తున్నాయి. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పే రాజకీయాలకు ముగింపు పలకాలి.
‘‘బీసీలకు న్యాయం జరిగే వరకు ఓబీసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, ఉద్యమాలు కొనసాగిస్తాం. బీసీలకు జరుగుతున్న దగాపై ఐక్య పోరాటాలతో ముందుకెళ్లాలి. బీసీ నినాదం ఏ రూపంలో ఉన్నా మంచిదే. బీసీల హక్కులపై ప్రజల్లో చైతన్యం పెంచేలా సప్పుడైతే కావాల్సిందే. ప్రతి ఇంటి నుంచి బీసీ నినాదం మొదలుకావాలి. ప్రతి కుటుంబం తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. బీసీల ఓట్లను ఎన్నికల సమయంలో వినియోగించుకుని.. రాజకీయ అవకాశాలు ఇవ్వని పరిస్థితిని మార్చాల్సిన సమయం వచ్చింది.

జనరల్ స్థానాలు అందరివీ.. ఒక్క వర్గానివి కావు
జనరల్ స్థానాలు అన్ని కులాలు, వర్గాల వారు పోటీ చేయడానికి ఉద్దేశించినవి. కానీ జనరల్ సీటు అంటే ఒకే వర్గానికి చెందిన అభ్యర్థులే పోటీ చేయాలనే భావన ఏర్పడింది. ముఖ్యంగా వరంగల్ మేయర్ స్థానం జనరల్గా మారినప్పుడు ఫలానా రెడ్డి, మరో రెడ్డి అంటూ చర్చ జరగడం ఏమిటి? బీసీల నుంచి నాయకులు లేరా? బీసీల్లో సామర్థ్యం ఉన్నవారు లేరా? జనరల్ మేయర్ స్థానం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఒక్క వర్గానికే పరిమితం చేయడం ఎందుకు?’’ అని సుందర్రాజ్ యాదవ్ ప్రశ్నించారు. ‘‘వరంగల్ మేయర్ స్థానం ఈసారి బీసీలకే దక్కేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం. బీసీలు రాజకీయంగా ఏకమైతే జనరల్ స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకునే శక్తి వస్తుంది. ఓసీలకు నోట్ల బలం ఉండొచ్చు. కానీ బీసీలకు ఓట్ల బలం ఉంది. ఆ ఓట్ల బలాన్ని రాజకీయ శక్తిగా మార్చుకోవాలి. బీసీలు విడిపోయి ఉంటే ఇతరులకు లాభం జరుగుతుంది. బీసీలంతా ఒకే మాటపై నిలబడితే రాజకీయ పార్టీలు కూడా తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మార్పునకు అడుగులు పడుతున్నాయి. పార్టీల్లో ఆ భయం మొదలైంది’’ అని ఆయన అన్నారు.

పరకాలలో బీసీల బహిరంగ సభ
‘‘అక్టోబర్లో పరకాలలో బీసీల బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 8 సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ సభల ద్వారా బీసీలకు రాజకీయ, సామాజిక హక్కులపై అవగాహన కల్పిస్తాం. బీసీలను ఏకం చేస్తాం. బీసీ లీడర్లు ఏ పార్టీలో ఉన్నా వారిని ప్రోత్సహిస్తాం. బీసీలు ఏ పార్టీలో ఉన్నా ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలను గుర్తు చేసుకునే విధానం మారాలి. ‘‘దేశవ్యాప్తంగా బీసీల హక్కులపై చర్చ మొదలైంది. ఈ చర్చను రాజకీయ ప్రాతినిధ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ ఉద్యమం బలపడితే డబ్బులు లేకుండానే అభ్యర్థులు గెలిచే పరిస్థితి వస్తుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో బీసీలను సమన్వయం చేస్తాం. బీసీ నాయకత్వాన్ని పెంచుతాం. బీసీ నాయకులు ఏ పార్టీలో ఉన్నా వారికి ఎదురయ్యే సమస్యలపై కలిసి పోరాడతాం. పార్టీలు వేరైనా బీసీల హక్కుల విషయంలో ఐక్యంగా ఉండాలి.
ఉద్యోగాలు, విద్యకు ఓబీసీ కార్యాచరణ
బీసీ యువతకు కేవలం రాజకీయ నినాదాలు సరిపోవు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి అవసరం. అక్టోబర్ 9న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో జాబ్మేళా నిర్వహిస్తున్నాం. బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతను ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నాం. బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఓబీసీ సంస్థ ద్వారా బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్నాం. బీసీలు ఉన్నత స్థాయికి ఎదగకుండా అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు సామాజిక ఐక్యత అవసరం. ఓసీలు మాకు శత్రువులు కాదు. అయితే బీసీలకు దక్కాల్సిన అవకాశాలను ఇతరులు ఆక్రమించకూడదు. విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. బీసీ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ప్రైవేటు రంగంలోనూ అవకాశాలు పొందేలా సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి.
ఈడబ్ల్యూఎస్, ఆదాయ పరిమితులపై ప్రశ్నలు
బీసీలకు, ఓసీలకు పేదరికాన్ని నిర్ణయించే ఆదాయ పరిమితుల్లో ఇంత తేడా ఎందుకు? బీసీలకు రూ.1.50 లక్షల ఆదాయం లోపు ఉంటే పేదలుగా పరిగణిస్తున్నారు. ఓసీలకు రూ.8 లక్షల ఆదాయం లోపు ఉంటే పేదలుగా పరిగణించడం ఏ విధమైన న్యాయం? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలోనూ రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతోంది. ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలి. బీసీల ఓట్లను తీసుకుని వారికి సీట్లు ఇవ్వకపోవడం సరైన విధానం కాదు. రాజకీయ పార్టీలు తాము బీసీలకు అనుకూలమా? వ్యతిరేకమా? ముందుగానే స్పష్టం చేయాలి. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. బీసీలకు న్యాయం చేయాలంటే కేవలం మాటలు కాకుండా ఆచరణలో నిర్ణయాలు తీసుకోవాలి. బీసీల హక్కుల విషయంలో రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.

వరంగల్ అభివృద్ధికి విజన్ అవసరం
వరంగల్ నగరానికి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వాటిని వినియోగించుకునేందుకు స్పష్టమైన ప్రణాళిక, దాన్ని అమలు చేసే నాయకత్వం అవసరం. కుడా ద్వారా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో ఇళ్లు అందించవచ్చు. నగరానికి బయట అపార్ట్మెంట్లు నిర్మించి రూ.30 లక్షల లోపు ధరలకు అందిస్తే మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. నేనుకుడా చైర్మన్గా పనిచేసిన సమయంలో ఈ విషయాన్ని నాటి ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తీసుకెళ్లాను. కానీ నాన్చివేత ధోరణితో పక్కన పెట్టేశారు. కుడా పరిధిలోని ప్రైవేటు భూములను అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ స్థలాలను కూడా వినియోగించుకోవాలి. సరైన ప్రణాళికతో పనిచేస్తే ఒక్క పశ్చిమ నియోజకవర్గానికే రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కుడా ద్వారా వచ్చే ఆదాయంలో 75 శాతం స్థానికంగానే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. భూముల మార్టిగేజ్ చార్జీలు వసూలు చేస్తే కుడాకు భారీ ఆదాయం వస్తుంది. నా హయాంలో పలువురికి నోటీసులు ఇచ్చినా ఆ అంశం తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి సంస్థలకు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించి.. ఆ ఆదాయాన్ని నగర అభివృద్ధికే వినియోగించాలి.
ఐటీ టవర్లు, టూరిజంతో ఉపాధి అవకాశాలు
హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటీ కేంద్రంగా ఎదగాలనే ఉద్దేశంతో పనిచేశాను. అమెరికా పర్యటనలో 13 కంపెనీలతో చర్చించి వరంగల్లో సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాను. మడికొండలో ఐటీ రంగానికి కేటాయించిన స్థలం చుట్టూ పారిశ్రామిక ప్రాంతం ఉండటంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నగర కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల్లో ఐటీ టవర్లు నిర్మించి కంపెనీలకు కేటాయిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం వరంగల్ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దేవునూరు గుట్టల్లోని 5 వేల ఎకరాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం. డిస్నీల్యాండ్ తరహా ప్రాజెక్టును తీసుకురావాలనుకున్నాం. ఇందుకోసం 500 ఎకరాలు కుడా కేటాయించేందుకు సిద్ధమని నాటి ప్రభుత్వం లేఖ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తే వరంగల్ ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఐటీ, టూరిజం, లాజిస్టిక్స్ రంగాలను అనుసంధానం చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నగర అభివృద్ధికి దీర్ఘకాలిక విజన్ అవసరం. తాత్కాలిక నిర్ణయాలతో కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలి.

తండ్రి మాటే జీవితానికి బాట
1970 జనవరి 1న వడ్డేపల్లిలో జన్మించాను. మా తల్లిదండ్రులు లక్ష్మీరాజం, వరలక్ష్మీ దంపతులకు 10 మంది సంతానం. అందరిలో నేనే చివరివాడిని. మా తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. చదువుపై ఆయనకు ఎంతో మక్కువ. కుటుంబంలోని అందరికీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయించారు. ఆడపిల్లలను చదివించేందుకు చాలామంది వెనుకాడిన కాలంలోనే మా రెండో అక్కను సివిల్స్ రాసేలా ప్రోత్సహించారు. మా తండ్రి లాహోర్లో చదువుకున్నారు. స్వాతంత్య్రం అనంతరం మా కుటుంబం వరంగల్లో స్థిరపడింది’’ అని సుందర్రాజ్ యాదవ్ తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. రూ.10 వేల ఫీజు చెల్లించలేక హైదరాబాద్లో డిగ్రీలో చేరాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేశాను. 1991లో రూ.1,200 మొదటి జీతంతో ఉద్యోగ జీవితం ప్రారంభించాను. మా తండ్రి భీమారంలోని ఇల్లు అమ్మి ఇచ్చిన రూ.1.50 లక్షలతో కంప్యూటర్ శిక్షణా కేంద్రానికి బీజం పడింది. 1992లో మాస్టర్జీ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించాను. ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో విద్యా రంగంలోకి అడుగుపెట్టాను. 2001 నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. 2009 నుంచి మాస్టర్జీ వేదికగా ఉద్యమ సమావేశాలు నిర్వహించాను. 2015, 2021లో ఎమ్మెల్సీ అవకాశాలు చేజారాయి. కుడా చైర్మన్, మేయర్ పదవులపై హామీలు వచ్చినా అమలు కాలేదు. అయినప్పటికీ ప్రజా జీవితం, బీసీ ఉద్యమం, వరంగల్ అభివృద్ధి కోసం నా ప్రయాణం కొనసాగుతుంది. బీసీలకు రాజకీయ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాను. బీసీలను ఏకం చేసి వారికి రావాల్సిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాల కోసం నిరంతరం పనిచేస్తాను’’ అని ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ స్పష్టం చేశారు.
ఉత్తరం కాకతీయ ఎడిటర్
కిరణ్ గౌడ్ అరెల్లి
-7396604266

