భూభారతి రీ-సర్వేలో భాగస్వాములు కావాలి
భూ వివరాలను పక్కాగా నమోదు చేసుకోవాలి
తేడాలు, అభ్యంతరాలను వెంటనే అధికారుల దృష్టికి తేవాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద సూచన
కాకతీయ, నల్లబెల్లి: భూభారతి రీ-సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆమె రీ-సర్వే ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. రీ-సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేయడంతో పాటు భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని, సర్వే సమయంలో అధికారులకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. భూ వివరాల్లో తేడాలు, అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీ-సర్వేను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసీల్దార్ కృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

