బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీలకు ఘన సన్మానం
శుభం ప్రకాష్, చేతన్ నితిన్ సేవలను గుర్తు చేసిన సీపీ
విధులపై నిబద్ధతతో పనిచేయాలని సన్ప్రీత్ సింగ్ సూచన
కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ
కాకతీయ, హనుమకొండ: పోలీస్ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లో ఏఎస్పీలుగా సేవలందించిన శుభం ప్రకాష్, చేతన్ నితిన్లు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందడంతో మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఇతర అధికారులతో సమన్వయంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించారని కొనియాడారు. ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని వారి అభిమానాన్ని సంపాదించిన ఈ అధికారులు, ఉన్నత హోదాల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
హాజరైన ఉన్నతాధికారులు
ఈ కార్యక్రమంలో డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, ధార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నేహ్ర పాల్గొన్నారు. అలాగే అదనపు డీసీపీలు రవి, సురేష్కుమార్, శ్రీనివాస్తో పాటు వివిధ విభాగాలకు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

