టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్
అల్లాడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు
లక్ష్యాలు చేరితేనే వేతనాల పెంపునకు మొగ్గు
పిల్లల్ని తీసుకురాకుంటే విధుల నుంచి తొలగింపు
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల వింత పోకడలు
వేసవి సెలవుల్లోనూ ఇంటింటికీ తిరిగి ప్రచారం
ఒక్కొక్కరికి 20 నుంచి 30 వరకు అడ్మిషన్ల టార్గెట్
నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు మానుకోవాలని హెచ్చరిక
పరేషాన్ అవుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు టీచర్లు
అధికారుల పర్యవేక్షణ లేక ఆందోళనలో బోధకులు
కాకతీయ, ఎడ్యుకేషన్/ పెద్దవంగర : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయివేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అడ్మిషన్ల టార్గెట్లు విధించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యాలు విధిస్తున్న అసాధ్యమైన లక్ష్యాలతో వారు సతమతమవుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని నిబంధనలు విధించడమే ఇందుకు ప్రధాన కారణం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ నెల 24 నుంచి వచ్చే జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ 48 రోజుల సెలవులను కుటుంబంతో సంతోషంగా గడపాలని భావించిన ఉపాధ్యాయులకు యాజమాన్యాలు ఊహించని షాక్ ఇచ్చాయి. అప్పగించిన అడ్మిషన్ల పనిని పూర్తి చేయకుంటే వచ్చే ఏడాది వేతనాలు పెంచేది లేదని స్పష్టంగా చెబుతుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ లక్ష్యాలను చేరుకోలేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
లక్ష్యాల పేరుతో తీవ్ర ఒత్తిడి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందలాది ప్రయివేటు విద్యా సంస్థల్లో వేలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. యాజమాన్యాలు ఒక్కో టీచర్ ఈసారి 20 నుంచి 30 అడ్మిషన్లు ఖచ్చితంగా తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. అప్పుడే అదనంగా 10 శాతం ఇంక్రిమెంట్ ఇస్తామని లేకుంటే పాత జీతాలే తీసుకోవాలని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పాఠశాలను కూడా మానుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేస్తున్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా పాఠశాలకు సంబంధించిన కరపత్రాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని మౌఖికంగా ఆదేశించడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా లెక్కచేయకుండా గ్రామాల్లో తిరుగుతూ అడ్మిషన్ల కోసం పాకులాడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు
ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ ను పూర్తి చేయడం సాధ్యం కాదని కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. 20 నుంచి 30 మంది కొత్త పిల్లలను తీసుకురావడం కష్టమని భావిస్తున్న వారు ఇతర పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్మిషన్ల బాధ్యతలు లేకుంటే వేతనం తక్కువైనా సరే అక్కడే చేరాలని చూస్తున్నారు. కాగా ఈసారి 20 అడ్మిషన్లు తీసుకురావాలని ఇటీవల పాఠశాల యాజమాన్యం చెప్పిందని ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక రెండు మూడు రోజుల నుంచి తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నానని చెప్పారు. 20 అడ్మిషన్లు కాకపోయినా కనీసం 15 వరకైనా చేయాలని చూస్తున్నానని ఉద్యోగం కావాలంటే ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసేందుకు కష్టపడాల్సి వస్తోందని వాపోయారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులను మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చడంపై మేధావులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

