పదో తరగతి ఫలితాల్లో ‘ములుగు’ టాప్
99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
589 మార్కులతో జిల్లా టాపర్గా కె. కృష్ణ
సమిష్టి కృషి ఫలితమన్న కలెక్టర్, మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. జిల్లాలో మొత్తం 3,287 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 3,264 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఏటూరునాగారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కె. కృష్ణ 589 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డిని, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ములుగు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడంపై రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ఉపాధ్యాయులు చూపిన మార్గనిర్దేశం ప్రశంసనీయమని అన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత 95.15 శాతంగా నమోదైంది. ఇందులో బాలికలు 96.26 శాతం, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆమె వివరించారు.

