డివిజన్ అయినట్టా.. కానట్టా..?!
సందిగ్ధంలో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రజలు
క్యాబినేట్ ఆమోదం పొందిన క్షేత్రస్థాయి ప్రక్రియ పెండింగే
ఇంకా ములుగు నుంచే ఆఫీసులు ఆపరేటింగ్
ఏటూరునాగారం డివిజన్ కాగితాలకే ‘పరిమితం?
100 కిలోమీటర్ల దూరంలోని ములుగుకు వెళ్లడానికి ఆదివాసీల కష్టాలు
మంత్రి సీతక్క నియోజకవర్గంలో పరిస్థితిపై విమర్శలు
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఎందుకు ఆలస్యమవుతోందంటూ ప్రశ్నలు
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. అయినట్టా.. కానట్టా అన్న సందేహం ఏజెన్సీ ప్రజలను వేధిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ నుంచి మంత్రివర్గ ఆమోదం వరకు అన్నీ అంచెలంచెలుగా జరిగిపోయినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘డివిజన్’ కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడం గమనార్హం. స్వయంగా మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నా నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉండటంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో వేగంగా ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి.. ఆతర్వాత ప్రక్రియను కూడా అంతే వేగంగా పూర్తి చేసింది. అయితే ఇంతలోనే ఎన్నికలు రావడంతో.. క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యాలయాల ఏర్పాటు అంశం అటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటికీ ఏటూరునాగారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ స్థాయి కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆశల పల్లకి.. అమలులో ముందడుగు ఏది?
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాలను కలిపి కొత్త డివిజన్ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పాలన మారినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేయడంతో ఏజెన్సీ వాసుల్లో ఆశలు చిగురించాయి. సంబరాలు జరిగాయి. ఆమోదం పొంది నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయి జీవో వెలువడలేదు. పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అధికారుల నియామకంపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. పాలకులు మారినా, ప్రకటనలు వచ్చినా ఏటూరునాగారం ప్రజల కల మాత్రం ఇంకా ఫైళ్లలోనే మగ్గిపోతోంది.

దూరభారంతో అల్లాడుతున్న గిరిపుత్రులు
డివిజన్ కేంద్రం లేకపోవడంతో ఆరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్యలు, కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్బుక్కుల వంటి చిన్న అవసరాలకు కూడా వాజేడు, వెంకటాపురం వంటి మారుమూల ప్రాంతాల ప్రజలు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. డివిజన్ కేంద్రం అందుబాటులోకి వస్తే పరిపాలన చేరువవుతుందని భావించినా, అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల ఉదాసీనత వల్ల ఏజెన్సీ ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాలో ప్రస్తుతం ఒక్క ములుగు డివిజన్ మాత్రమే ఉండటంతో పనిభారం పెరిగి సేవలు కూడా ఆలస్యమవుతున్నాయి.
ముందడుగు పడేనా.. గాలిలో దీపమేనా?
ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం, కొత్త డివిజన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళాన్ని మరింత పెంచుతోంది. గెజిట్ వచ్చి, క్యాబినెట్ ఆమోదం పొందిన అంశాన్ని జీవో రూపంలోకి తెచ్చి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అడ్డంకులు ఎక్కడున్నాయంటూ గిరిజన విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. “ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ నిజంగానే వస్తుందా..? మరో హామీగానే మిగిలిపోతుందా..?” అన్న సందేహాలు ఇప్పుడు ఏజెన్సీ అంతటా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి సీతక్క, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

