స్టోన్ క్రషర్ల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
బ్లాస్టింగ్తో గ్రామాన్ని కమ్మేసిన కాలుష్యం
ఆత్మకూరులో కటాక్షపూర్ గ్రామస్థుల ఆందోళన
సుమతి స్టోన్ క్రషర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్
కాకతీయ, ఆత్మకూరు : మండలంలోని కటాక్షపూర్ శివారులో ఉన్న సుమతి స్టోన్ క్రషర్ స్థానికులకు శాపంగా మారింది. క్రషర్ వల్ల వెలువడుతున్న కాలుష్యం, నిరంతరం జరుగుతున్న బ్లాస్టింగ్ల వల్ల ప్రాణహాని ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ లైసెన్స్ను వెంటనే రద్దు చేసి, దాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం జాతీయ రహదారి 163పై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండు రోజులుగా క్రషర్లో భారీగా బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారు. దీనివల్ల గ్రామం మొత్తం ధూళి కాలుష్యంతో నిండిపోయింది. దీంతో గ్రామంలోని చిన్నారులు, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగ్ల ప్రభావం వల్ల క్రషర్ సమీపంలోని పంట పొలాలు కూడా పాడవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని కలిగించే ఈ క్రషర్ను తొలగించాలని కోరుతూ ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిలిచిన ట్రాఫిక్.. ఆందోళన
గ్రామస్తుల నిరసనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తులతో చర్చలు జరిపి ధర్నాను విరమింపజేశారు. క్రషర్ ఓనర్ అధికారులకు ‘చేతివాటం’ చూపడం వల్లే వారు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సుమతి స్టోన్ క్రషర్ను వెంటనే మూసివేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కటాక్షపూర్ ప్రజలకు మేలు చేయాలని వారు కోరుతున్నారు.

