నెల దాటినా వీడని చీకట్లు
మంగపేట మండలంలో గాలివానకు కూలిన విద్యుత్ లైన్లు
మృత్యుపాశాలుగా వేలాడుతున్న విద్యుత్ తీగలు
ఫిర్యాదులు చేసినా మరమ్మతులను పట్టించుకోని అధికారులు
ఎన్పీడీసీఎల్ సీఎండీ చెప్పిన దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి
పంట పొలాల్లో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు, పోల్స్
వర్షాకాలం దగ్గరకొస్తున్నాయంటూ అన్నదాతల ఆందోళన
33కేవీ పనులు పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని విస్మరించిన వైనం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలో గత నెల ఏప్రిల్ 23న సంభవించిన భారీ గాలివాన, ఈదురుగాలుల ధాటికి కమలాపురం పరిసర ప్రాంతాల వ్యవసాయ పొలాల్లో కూలిపోయిన విద్యుత్ స్తంభాలు ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. దాదాపు నెల రోజులు గడుస్తున్నా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు కనీసం స్పందించకపోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో 15 రోజుల్లో వర్షాకాలం సమీపిస్తుండటంతో పంటల సాగు కోసం దుక్కులు సిద్ధం చేసుకోవాల్సిన తరుణంలో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. కమలాపురం పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ఏప్రిల్ 23న కురిసిన అకాల వర్షం, బలమైన గాలుల ప్రభావంతో వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో స్తంభాలు పూర్తిగా విరిగి ముక్కలు కాగా, మరికొన్ని చోట్ల ప్రమాదకరంగా వంగిపోయి ఉన్నాయి. ప్రధానంగా కండక్టర్ వైర్లు తెగిపోయి నీరు నిలిచే పొలాల్లో పడి ఉండటం వల్ల రైతులు ఆ పరిసరాల్లోకి వెళ్లడానికే భయపడుతున్నారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో భూములను చదును చేసేందుకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను పొలాల్లోకి తీసుకువెళ్లడం సాధ్యం కావడం లేదు. కనీసం విరిగిన పోల్స్, వైర్లను తొలగించకపోవడంతో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.


ప్రజా బాటలో నిలదీసినా నిర్లక్ష్యమే
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో కమలాపురం రైతులు తమ సమస్యను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నేలపై పడి ఉన్న ప్రమాదకర వైర్లను తొలగించి, కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చలనం రాలేదు. రైతులు పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా చూస్తాం, త్వరలో చేస్తాం అనే కాలయాపన సమాధానాలే తప్ప ఆచరణలో పనులు ప్రారంభం కాలేదు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణలో జరుగుతున్న ఈ ఆలస్యం వల్ల రాబోయే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామగ్రి కొరతతో పరిపాలనా వైఫల్యం
విద్యుత్ శాఖ అంతర్గత పరిశీలనను విశ్లేషిస్తే సబ్ డివిజన్ స్థాయిలో ముందస్తు ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా వర్షాకాలానికి ముందే అత్యవసర పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా డివిజన్ స్టోర్లలో అదనపు విద్యుత్ స్తంభాలు, కండక్టర్ వైర్లు, ఇన్సులేటర్లను సిద్ధంగా ఉంచాలి. కానీ మంగపేట పరిధిలో ముందస్తు నిల్వలు లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైంది. ఉన్నతాధికారులు ముందుగా కేవలం 33 కేవీ ప్రధాన లైన్ల పునరుద్ధరణకే ప్రాధాన్యత ఇచ్చి, గ్రామీణ సబ్ స్టేషన్ల పరిధిలోని 11 కేవీ వ్యవసాయ లైన్లను పూర్తిగా విస్మరించారు. కొత్త కరెంట్ పోల్స్ జిల్లా కేంద్రం నుండి సకాలంలో సరఫరా కాకపోవడం, అంతర్గత రవాణా ఖర్చుల మంజూరులో జాప్యం వల్ల క్షేత్రస్థాయి సహాయ ఇంజినీర్లు చేతులెత్తేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ జరిపి, తక్షణమే కొత్త స్తంభాలను మంజూరు చేసి విద్యుత్ సరఫరాను పునఃప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలుచేపడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
కొత్త విద్యుత్ స్తంభాలు రాగానే పునరుద్ధరిస్తాం-మంగపేట ఏఈ కృష్ణారావు
గాలి వాళ్లకు విద్యుత్ స్తంభాలు విరిగిపడిన విషయం మా దృష్టికి వచ్చింది. ముందుగా 33 కెవి పోళ్లను సరిచేసి తరువాత 11 కెవి స్తంభాలను కూడా పునరుద్ధరించాము. పంట పొలాల్లో విరిగిపడిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయవలసి ఉండగా కొత్త స్తంభాలు అందుబాటులో లేకపోవటంతో పునరుద్ధరణ ఆలస్యం అవుతుంది. కొత్త విద్యుత్ స్తంభాలు రాగానే పునరుద్ధరణ చర్యలు చేపట్టి రైతులకు విద్యుత్ సరఫరా చేస్తాం.

