జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కృషి చేస్తా
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
: మంత్రి సీతక్క
టీయూడబ్ల్యూజే (ఐజెయు) నూతన కార్యవర్గానికి మంత్రి అభినందనలు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా కార్యవర్గ సభ్యులు మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మంత్రికి శాలువా కప్పి, మెమొంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో జర్నలిస్టులు ఐకమత్యంతో పనిచేస్తూ వృత్తిపరంగా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆమె, త్వరలోనే వారి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్రధాన డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే మంచి శుభవార్త వస్తుందని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు మంత్రి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిని కలిసిన అనంతరం జర్నలిస్టుల యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా మర్యాదపూర్వకంగా కలిసి మెమొంటోలు అందించి, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజెయు జిల్లా అధ్యక్షుడు ఎండి షఫీ అహ్మద్, కార్యదర్శి చిదురాల వాసు, ఉపాధ్యక్షులు బిక్కనూరి సుమన్, చింతల దేవేందర్, ఆలుగొండ రమేష్, ఎనగందుల శంకర్, సునర్కాని శ్యామ్, సుంకరి సంపత్ రావు, గాదె సుమన్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

