పేరుకే పెద్ద స్కూల్
ఫీజులు ఎక్కువ… సౌకర్యాలు తక్కువ!
నిర్వహణ లేని మరుగుదొడ్లు
ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు..
కిటికీలకు తలుపులు లేక అట్టపెట్టెలతో సరి!
టాయిలెట్లకు తలుపులు లేవు.. కర్టెన్లతో నెట్టుకొస్తున్న బిట్స్ స్కూల్ యాజమాన్యం
బయటకేమో కార్పొరేట్ ఆర్భాటం.. లోపల మాత్రం అధ్వాన్న వసతులు
కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్
తనిఖీలు చేస్తామన్న డీఈవో
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీ ప్రాంతంగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా ఇటీవల కాలంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా విద్యా రంగంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటుండటాన్ని ఆసరాగా చేసుకుని బడా కార్పొరేట్ విద్యాసంస్థలు ఇక్కడ తిష్ట వేశాయి. అమాయక ప్రజల నుంచి దండుకోవడమే లక్ష్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ, కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రంలో బాలాజీ టెక్నో స్కూల్ (బిట్స్ స్కూల్) పేరుతో నిర్వహిస్తున్న విద్యాసంస్థ దోపిడీ, నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఇతర ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ఈ బిట్స్ స్కూల్ అడ్డగోలుగా ఫీజులు గుంజుతోందని, దీని ప్రభావంతో మిగతా పాఠశాలలు కూడా ఫీజుల పెంపు బాట పట్టాయని తల్లిదండ్రులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయి విద్య, ఏసీ క్లాస్ రూములు అంటూ రంగుల ప్రపంచం చూపిస్తూ వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, లోపల మాత్రం కనీస మౌలిక సదుపాయాలు మచ్చుకైనా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లు..!
బిట్స్ పాఠశాలలో విద్యార్థులు చదువుకునే తరగతి గదుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గాలి, వెలుతురు కూడా రాని ఇరుకైన గదుల్లో గొర్రెల మందలా విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. తరగతి గది కిటికీలకు కనీసం తలుపులు కూడా లేకపోవడం గమనార్హం. కిటికీలకు ఏకంగా కార్డ్బోర్డ్ షీట్లు (అట్టపెట్టెలు) అమర్చి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల బయటి శబ్దాలు క్లాసులను డిస్టర్బ్ చేయడమే కాకుండా, వర్షాకాలంలో వాన నీరు నేరుగా లోపలికి వచ్చి విద్యార్థులు తడిసిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు స్కూల్ ఆవరణలో, క్లాస్ రూములలో హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు ఓపెన్గా ఉంటూ విద్యార్థులకు అందేలా ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్కూల్ యాజమాన్యం మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు.
టాయిలెట్లకు కర్టెన్లు.. భరించలేని దుర్వాసన!
ఈ కార్పొరేట్ పాఠశాలలోని టాయిలెట్ల పరిస్థితి చూస్తే ఎవరైనా అసహ్యించుకోవాల్సిందే. క్లాస్ రూమ్లకు అత్యంత సమీపంలోనే ఉన్న టాయిలెట్లకు కనీసం తలుపులు కూడా అమర్చలేదు. కేవలం పాత కర్టెన్లను వేసి మమ అనిపించారు. అక్కడ నుంచి వచ్చే విపరీతమైన దుర్వాసన తరగతి గదుల వరకు వ్యాపిస్తుండటంతో పసిపిల్లలు శ్వాస తీసుకోలేక, అనారోగ్యాల పాలవుతున్నారు. విద్యార్థులకు అందించే తాగునీరు సైతం కలుషితంగా మారుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బయట బస్సులు, హోర్డింగులు, ప్రత్యేక ప్రోగ్రామ్ల పేరిట భారీగా ఆర్భాటం చేస్తూ కార్పొరేట్ ఇమేజ్ సృష్టిస్తున్న ఈ పాఠశాల.. అంతర్గతంగా మాత్రం నరకకూపాన్ని తలపిస్తోంది. జిల్లాలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న సదరు పాఠశాల.. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో కనీసం టాప్ లీగ్లో కూడా నిలవకపోవడం వీరి విద్యా ప్రమాణాలకు, చేతకానితనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
వసతుల్లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
– ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి టిఎల్ రవి
ములుగు జిల్లాలో ప్రైవేటు పాఠశాల యజమానులకు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ఉండటం లేదు. విద్యాశాఖ అధికారులు స్కూల్ ప్రారంభానికి ముందే ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి కనీస మౌలిక వసతులు కల్పించని పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలి.
వసతుల్లేని ప్రైవేట్ స్కూల్లో పై చర్యలు తప్పవు
-జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి
ములుగు జిల్లాల ప్రైవేటు పాఠశాలలలో విద్యాశాఖ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తాం. అధిక ఫీజులు,విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు స్కూళ్ల పైన శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.



