ఎస్ఐఆర్ సర్వే పారదర్శకంగా జరగాలి
పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
దుగ్గొండిలో ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ, దుగ్గొండి : ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి చేరుకుని అర్హుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. దుగ్గొండి మండల కేంద్రంలో శనివారం క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆమె, నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని సూచించారు. ప్రజల సహకారంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ సమ్మక్క, జీపీవో రమేష్, బీఎల్వోలు శ్రీదేవి, సరళ, సునీత మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

