భూ వివాదంపై పోలీసుల కొరడా
ముందస్తు చర్యల్లో భాగంగా ఇరు వర్గాలకు నోటీసులు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏటూరునాగారం పోలీసులు హెచ్చరించారు. మండల పరిధిలో భూస్వామ్య హక్కులపై ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో నమోదైన కేసులు, ప్రస్తుతం కొనసాగుతున్న వివాదాలను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారతీయ నాగరిక సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 మరియు 164 కింద ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేశారు. వివాదానికి సంబంధించిన ఇరు వర్గాలు చట్టాన్ని గౌరవించి, ఎటువంటి ఘర్షణలకు పాల్పడకుండా ఉండాలని పోలీసులు సూచించారు. నోటీసులు అందుకున్న వారు నిర్దేశించిన తేదీన సంబంధిత అధికారుల ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని వారు ఆదేశించారు.

