సీట్లకు అంటుకుపోయారు!
రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు
బదిలీ నిబంధనలు నీటి మూటలేనా?
6 ఏళ్లుగా ఒకే స్థానంలో సురేష్
కేసులు పెండింగ్ లో ఉన్నా చలామణి అవుతున్న మరికొందరు
డిప్యూటేషన్ అర్ఐ వ్యవహారంపై అనుమానాలు
కమిషనర్ వెంకన్న సార్ జోక్యం చేసుకుంటారా?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నీరు ఉన్నంతసేపు కప్పలు బావిని వదలనట్లు బల్దియాలో అమ్యామ్యాలకు ఆశపడ్డ ఆర్ఐలు ఏళ్ళతరబడి అదే విభాగాన్ని వదలక పోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగంలో అక్రమాలు రోజురోజుకూ బట్టబయలవుతున్నాయి. ఇటీవల ఖాళీ స్థలాలకు సైతం ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తడంతో బల్దియా కమిషనర్ టి వెంకన్న స్వయంగా రంగంలోకి దిగి రెవెన్యూ అధికారులపై గ్రీవెన్స్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఉంటేనే నంబర్ ఇవ్వాలి, గూగుల్ ఫోటో అప్లోడ్ చేయాలి అంటూ కమిషనర్ హెచ్చరించారు. అయితే ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు కారణం ఏళ్ల తరబడి ఒకే స్థానంలో తిష్ట వేసిన కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)లే అని, విస్తృతంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినా ఒకే చోట మూడేళ్లకు మించి కొనసాగకూడదు. ప్రతి మూడేళ్లకు తప్పనిసరిగా బదిలీ చేయాలి. ఇది అవినీతి నిరోధానికి, పారదర్శక పాలనకు ఉద్దేశించిన నిబంధన. కానీ, జిడబ్ల్యూఎంసిలో మాత్రం ఈ నిబంధన తుంగలో తొక్కినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

నిబంధనలను బేఖాతరు చేస్తున్న ఆర్ఐలు
బల్దియా వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం…ఆర్ఐ సురేష్ 2021 నుంచి దాదాపు 6 సంవత్సరాలు ఆర్ఐగా కొనసాగుతున్నారు. అంటే రెండు బదిలీల కాలం దాటిపోయింది. ఇంత సుదీర్ఘకాలం ఒకే చోట ఎలా ఉంటున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.అలాగే సయ్యద్ సోహెల్ 07-12-2022 నుంచి 3 ఏళ్లు 7 నెలలుగా అర్ఐగా కొనసాగుతున్నారు. నిబంధన ప్రకారం ఏడాది క్రితమే బదిలీ కావాలి. విశేషం ఏమంటే ఈయనపై డిసిప్లినరీ కేసు పెండింగ్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసు ఉన్న అధికారిని కీలక రెవెన్యూ బాధ్యతల్లో ఎలా కొనసాగిస్తున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
జె నవనీత్, ఎస్ శ్రీకాంత్ వీరిద్దరూ కూడా 07-12-2022 నుండే అర్ఐలుగా అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం కూడా 3 ఏళ్లు 7 నెలలు దాటింది.
వివాదాలకు కేంద్ర బిందువుగా మరో ఇద్దరు :
ఆర్ఐ సిహెచ్ అనిల్ కుమార్ : ఈ ఆర్ ఐ మహబూబాబాద్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు. 06-11-2025 నుంచి జీడబ్ల్యూఎంసీలో బాధ్యతలు చేపట్టారు. సొంత కార్పొరేషన్ లో అర్హులైన సిబ్బంది ఉండగా, డిప్యూటేషన్ పై వచ్చిన వ్యక్తికి కీలకమైన అర్ఐ పోస్టు కట్టబెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎవరి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే ఆర్ఐ ఏ కృష్ణారావు 04-12-2025 నుంచి విధుల్లో కొనసాగుతున్నారు. ఈయనపై క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, అలాంటి వ్యక్తికి రెవెన్యూ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా, జి నరేష్ , యం ప్రతిభ, పి అశోక్ (20-08-2025), సమద్ (03-06-2026), చార్లెస్ (27-06-2026) లు కొత్తగా నియమితులయ్యారు.
ఆరోపణల వెనుక అసలు లెక్కేంటి?
బల్దియా రెవెన్యూ విభాగంలో ఇంటి నంబర్ల జారీ, ఆస్తి పన్ను అంచనా వంటివి అర్ఐ చేతిలోనే ఉంటాయి. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి ఒకే ఏరియాలో ఉంటే ఆ ఏరియాలోని అక్రమ నిర్మాణాలు, పన్ను ఎగవేతలపై పట్టు బిగించడం కష్టమవుతుందని, అందుకే మూడేళ్ల నిబంధన పెట్టారని అధికారులే చెబుతున్నారు. కానీ జిడబ్ల్యూఎంసిలో ఈ నిబంధనను పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలున్నాయి.
పైరవీలు, పైసలు ఉంటే ఎన్నేళ్లయినా ఒకే సీట్లో ఉండొచ్చు అనేది బల్దియాలో నిరూపితమైంది. ఈ కమిషనర్ అయినా పట్టించుకుని ప్రక్షాళన చేస్తారా? లేక ఫైళ్లు తొక్కిపెడతారా? అని వేచి చూడాలని సీనియర్ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇస్తున్నారనే ఆరోపణలపై కమిషనర్ సీరియస్ అయిన తరుణంలో, ముందుగా ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఈ అర్ఐలను బదిలీ చేసి, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

