తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి
ముత్తారంలో హృదయ విదారక ఘటన
ఒకే కుటుంబంలో వరుస విషాదాలు
కాకతీయ,శంకరపట్నం : మండలంలోని ముత్తారం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొంగోని విజయ (55) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. తల్లి మరణవార్త విని తీవ్రంగా కలత చెందిన ఆమె కూతురు బొంగోని మంజుల (38) కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగానే కూతురు బొంగోని మంజుల మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొద్దిసేపటి వ్యవధిలోనే తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

