నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ప్రజల భద్రతకు నిరంతరం నిఘా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
: పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు
కాకతీయ, హనుమకొండ: వరంగల్ నగరంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరస్థులు రైలు మార్గాల ద్వారా నగరానికి చేరుకుని చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ నేరాలను అరికట్టేందుకు సీసీఎస్ ఆధ్వర్యంలో వరంగల్, కాజీపేట స్టేషన్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సహకారంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. రైళ్లలో ప్రయాణించే అనుమానితులను అదుపులోకి తీసుకుని, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతతో వారి వివరాలను డేటాబేస్తో సరిపోల్చి తనిఖీ చేస్తున్నామని వివరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, జీఆర్పీ డీఎస్పీ కృపాకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐ అభినవ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

