బల్దియా ‘డౌట్’సోర్సింగ్!
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుపై ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన
సంక్షేమ పథకాల్లో లబ్ది పొందలేకపోతున్నామని ఆందోళన
కాదని నిరూపించుకునేందుకు నిత్యం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు
తన తల్లికి పింఛన్ మంజూరు కావడం లేదని ఓ ఉద్యోగి నిర్వేదం
కాకతీయ, వరంగల్ : ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వం ద్వారా ఎంపికయ్యారా? ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎంపికయ్యారా? లేదా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులా? అనేది సాధారణ ప్రజలకు సంశయమే. కానీ, ఇక్కడ ఉద్యోగులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది గుర్తింపుపై వారే ముక్కున వేలేసుకుంటున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందుతూ.. సమస్యను పరిష్కరించాలని నిత్యం ఆఫీసు చుట్టూ, అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులా?
ఏ ప్రభుత్వ కార్యాలయమైనా కింది స్థాయి సిబ్బంది ఎక్కువ శాతం కాంట్రాక్ట్ బేసిక్ పైన పని చేస్తుంటారని తెలిసిందే. వారి వేతనాలు, ఇతర అలవెన్సులు వేరుగా ఉంటాయి. అయితే, వరంగల్ బల్దియాలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా సాగుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇదే వారికి శాపంగా మారినట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా ప్రైవేటు జాబ్ కిందే లెక్క, వీరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో లబ్ది పొందే అవకాశం ఉంటుంది. అయితే, బల్దియాలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రికార్డుల్లో నమోదు కావడంతో వారు, వారి కుటుంబ సభ్యులు సంక్షేమ పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. దీంతో ఆయా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తన తండ్రి మూడేళ్ల క్రితం మరణించగా, తాను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందిన కారణంగా.. తన తల్లికి విడో పెన్షను మంజూరు చేయడం లేదని ఓ ఉద్యోగి వాపోయాడు. ఇంకా వరంగల్ బల్దియాలో పని చేస్తున్న పలువురు పీహెచ్ సిబ్బంది ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ పథకాల్లో అనర్హులుగా గుర్తించడం పట్ల వీరు తీవ్ర మనోవ్యథకు గురవుతున్నారు.
సర్టిఫైడ్ కాపీల కోసం..
ఈ నేపథ్యంలో పీహెచ్ ఉద్యోగులు తాము ఔట్సోర్సింగ్ సిబ్బంది అని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీరి గుర్తింపు విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో గానీ, ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని మథన పడుతున్నారు. ఇదే క్రమంలో తాము ఔట్సోర్సింగ్ సిబ్బంది అని సర్టిఫైడ్ కాపీలు పొందడానికి బల్దియా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తించి.. ఒక్కొక్కరికి సర్టిఫైడ్ కాపీ కాపీలు ఇచ్చే బదులు అసలు రికార్డుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులమనే గుర్తింపును తొలగించి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

