ఇక్కడి భూములు ఆక్రమిస్తామంటే ఊరుకోం
తాత ముత్తతాల నుంచి ఈ నేలతో అనుబంధం
గిరిజనేతరులను ఇక్కడి నుంచి ఎవరు దూరం చేయలేరు
ఆదివాసుల ముసుగులో కొంతమంది ఆగడాలు
రాళ్లకుంట చెరువు సర్వే నంబర్ 209లో ఆక్రమాలు
బడే సులోచన, శమంతకమణి, పెనక నాగమణులపై గండేపల్లి సత్యం ధ్వజం
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అటవీ శాఖకు విజ్ఞప్తి
తమ చెరువు భూమి జోలికొస్తే ఊరుకునేది లేదన్న మహాలక్ష్మి
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంలోని రాళ్లకుంట చెరువు శివారు భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ ఆరోపణలు రేకెత్తుతుతున్నాయి. సర్వే నంబర్ 209లో గల ప్రభుత్వ భూమిని, చెరువు శివారు ప్రాంతాలను ఆదివాసుల పేరుతో కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని గండేపల్లి సత్యం విమర్శలు చేశారు. బడే సులోచన, శమంతకమణి, పెనక నాగమణిలు ఆదివాసులమనే ముసుగులో చట్టవిరుద్ధంగా భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. కొందరి స్వార్థపూరిత చర్యల వల్ల గిరిజనుల ఆత్మగౌరవం మంటగలుస్తోందని, చట్టాన్ని గౌరవించే, ప్రకృతిని కాపాడే ఆదివాసీ జాతికి వీరి వల్ల చెడ్డపేరు వస్తోందని అన్నారు. రాళ్లకుంట చెరువు పరివాహక ప్రాంతంలోని భూములను కబ్జా చేయడం వల్ల రాబోయే వర్షాకాలంలో ముంపు ముప్పు పొంచి ఉందని, భూగర్భ జలాలు దెబ్బతినే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చట్టంతోనే బుద్ధి చెబుతాం
ఈ వ్యవహారంపై మహాలక్ష్మి మాట్లాడుతూ రాళ్లకుంట చెరువు మా తాతల కాలం నుంచి మా జీవనాధారం. ఈ నేల మీద మా హక్కును ఎవరూ కాలరాయలేరు. ఆదివాసుల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా, మా ఊరి పరువు తీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని మహాలక్ష్మి ఘాటుగా హెచ్చరికలు చేశారు. చెరువు భూమి జోలికొస్తే, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండానే చట్టపరంగానే బుద్ధి చెబుతామంటూ పేర్కొన్నారు. గిరిజనులు, గిరిజనేతరులు వందల ఏళ్లుగా ఇక్కడ కలిసి ఉంటున్నామని, దయచేసి తమ మధ్య చిచ్చు పెట్టవద్దని ఆమె కోరారు. సర్వే నంబర్ 209లో జరుగుతున్న అక్రమాలపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సత్యం డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సర్వే నిర్వహించి వాస్తవాలను బయటపెట్టి, ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

