ములుగు వెలుగు ఎక్కడ…?
ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు విధానం అస్తవ్యస్తం
ఉన్నతాధికారుల సహకారంతో విధులకు ఉద్యోగుల డుమ్మా
డిజిటల్ హాజరు విధానం లేకపోవడంతో సాగుతున్న ఇష్టారాజ్యం
గతంలో డిజిటల్ హాజరు అమలుతో సత్ఫలితాలు
నేడు విస్మరణతో కార్యాలయాల్లో దొరకని అధికారులు
అటెండెన్స్ యాప్ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్న ప్రజలు
కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని జనం నుంచి డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందాలన్నా, పలు శాఖల పరిపాలన సక్రమంగా సాగాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పాత్ర కీలకం. అయితే ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని, హాజరు విషయంలోనూ అనేకసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ములుగు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సమయపాలన, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై బహిర్గతంగానే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఉద్యోగుల హాజరుపై గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి వినూత్నంగా ప్రవేశపెట్టిన ములుగు వెలుగు అటెండెన్స్ మొబైల్ యాప్ను మళ్లీ అమలు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.
2019లో డిజిటల్ హాజరు విధానం
ఉద్యోగులు సమయానికి విధులకు హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి కలెక్టర్ సి. నారాయణరెడ్డి డిజిటల్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఉద్యోగులు కార్యాలయానికి చేరుకున్న వెంటనే సెల్ఫీ, సమయం, జీపీఎస్ లొకేషన్ ఆధారంగా హాజరు నమోదు చేసుకునే విధంగా ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ను రూపొందించారు. ములుగు వెలుగు అటెండెన్స్ ఇంటర్నెట్ లేకున్నా హాజరు నమోదు చేసి, తర్వాత సిగ్నల్ వచ్చినప్పుడు సర్వర్కు అప్డేట్ అయ్యే సదుపాయం కూడా ఇందులో ఉండేది. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉద్యోగులకు ఈ విధానం వర్తింపజేశారు. 2019 నుంచి ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ అమల్లో ఉండటంతో ఉద్యోగుల హాజరుపై జిల్లా యంత్రాంగానికి ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండేది. ఆలస్యంగా రావడం, గైర్హాజరు కావడం, కార్యాలయానికి రాకుండానే హాజరు చూపించడం వంటి అంశాలకు గణనీయంగా అడ్డుకట్ట పడిందని జిల్లాలోని పలువురు మేధావులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి కలెక్టర్లు మారడంతో మరుగున పడిపోయి మళ్లీ పాత పద్ధతి పునరావృతం అవుతుందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
మళ్లీ మాన్యువల్ హాజరుపై ప్రశ్నలు
2019 నుండి 2022 వరకు యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియ జరగగా ప్రస్తుతం ఆ విధానం అమల్లో లేకపోవడంతో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన లోపిస్తోందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ నుంచి ప్రతిరోజూ ములుగుకు రాకపోకలు సాగించే కొందరు ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు చేరుతున్నారని, దూర ప్రయాణాన్ని కారణంగా చూపిస్తూ విధుల్లో చేరుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొందరు కార్యాలయానికి రాకున్నా ఉన్నతాధికారుల సహకారంతో విధుల్లో ఉన్నట్టు చూపిస్తున్నారని విమర్శలు కూడా స్థానిక ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్, డిజిటల్ సేవలు, కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందిన ఈ యుగంలో కూడా కొన్ని కార్యాలయాల్లో ఇప్పటికీ మాన్యువల్ హాజరు రిజిస్టర్ల ద్వారానే ఉద్యోగుల హాజరు నమోదు చేయడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ పాత పద్ధతిలో హాజరు పుస్తకాలను నిర్వహించడం వల్ల పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. మాన్యువల్ హాజరు విధానం కొందరు ఉద్యోగులకు వరంగా మారిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సమయపాలన పాటించని, ఆలస్యంగా వచ్చిన లేదా కార్యాలయాలకు సక్రమంగా హాజరు కాని కొందరు ఉద్యోగులు కూడా హాజరు నమోదు చేసుకుని విధులు నిర్వహించినట్లుగా చూపించుకునే అవకాశం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పై అధికారులను మెప్పించుకోవడం ద్వారా కొందరు ఉద్యోగులు చర్యల నుంచి తప్పించుకుని తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణల నిజానిజాలను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ధారించాల్సి ఉంది.
ఏఐ, బయోమెట్రిక్తో డిజిటల్ హాజరుకు డిమాండ్
ప్రజల అభిప్రాయం ప్రకారం, గతంలో అమలైన ములుగు వెలుగు అటెండెన్స్ వంటి డిజిటల్ హాజరు విధానాన్ని ఆధునిక సాంకేతికతతో మళ్లీ తీసుకురావడం వల్ల ఉద్యోగుల సమయపాలన మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెరుగుతుందని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏఐ ఆధారిత పర్యవేక్షణ, ఆన్లైన్ హాజరు నమోదు, బయోమెట్రిక్ విధానం లేదా జీపీఎస్ ఆధారిత డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అమలు చేస్తే ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు హాజరయ్యే అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సక్రమంగా జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ను మళ్లీ తీసుకురావాలి
-ముంజాల భిక్షపతి, ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు
ప్రస్తుతం ప్రతి రంగంలో సాంకేతికత పెరిగింది. బ్యాంకులు, ఆస్పత్రులు, ప్రభుత్వ సేవలు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా మాన్యువల్ హాజరు నమోదు చేయడం వల్ల సమయపాలనపై అనుమానాలు వస్తున్నాయి. గతంలో అమలు చేసిన ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ను మళ్లీ తీసుకురావాలి. అధికారులు సమయానికి కార్యాలయాలకు వస్తే ప్రజల పనులు కూడా వేగంగా పూర్తవుతాయి.

యాప్ అటెండెన్స్ మళ్లీ అమలు చెయ్యాలి
– కోగిల మహేష్, బీఆర్ఎస్ ములుగు జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షులు
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే కొన్నిసార్లు అధికారులు అందుబాటులో లేక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న మనువల్ అటెండెన్స్ తో పాటు డిజిటల్ యుగంలో ఏఐ, బయోమెట్రిక్, జీపీఎస్ ఆధారిత హాజరు విధానం అమలు చేస్తే ఉద్యోగుల హాజరులో పారదర్శకత వస్తుంది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ‘ములుగు వెలుగు అటెండెన్స్’ యాప్ను ఆధునిక సాంకేతికతతో మళ్లీ అమలు చేస్తే ప్రభుత్వ కార్యాలయాల పనితీరు మరింత మెరుగుపడుతుంది.


