అక్రమ టోల్ వసూళ్లపై మౌన దీక్ష
సమాధానం వచ్చే వరకు దీక్ష విరమించబోనన్న ఎస్పీకే సాగర్
రాజ్యాంగ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : అక్రమ టోల్ వసూళ్లను నిలిపివేసి, రాజ్యాంగ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ది నేషనల్ కన్స్యూమర్ హెడ్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, సామాజిక కార్యకర్త ఎస్పీకే సాగర్ సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మౌన పోరాట దీక్ష చేపట్టారు. జిల్లాలో చట్టబద్ధత లేని టోల్ వసూళ్లు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, దీనిపై జిల్లా యంత్రాంగం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకే సాగర్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-265 ప్రకారం చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎలాంటి పన్ను లేదా రుసుము వసూలు చేయరాదన్నారు. సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు కూడా సేవలు అందించని సంస్థలు టోల్ వసూలు చేయడానికి హక్కు లేదని స్పష్టం చేశాయని గుర్తు చేశారు. జోహార్నగర్–పస్రా మార్గంలో ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్ రుసుము కట్ అయిన విషయాన్ని గతంలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని తెలిపారు. నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా తక్కువ దూరంలోనే మరో టోల్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా పూర్తి వివరాలు ఇవ్వలేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు దీక్షను విరమించబోనని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

