డెంగ్యూపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు
ప్రతి ఇంట్లో జ్వర సర్వే చేయాలి
డీఎంహెచ్వో డా. బి. రాజారెడ్డి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నగరంలోని డాక్టర్స్ కాలనీలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో నివారణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి ఆదేశించారు. బుధవారం డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి ప్రజలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీతో పాటు డెంగ్యూపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి జ్వర సర్వే నిర్వహించాలని, లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. యాంటీ లార్వల్ చర్యలు, ఫాగింగ్ చేపట్టడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దేశాయిపేట, చింతల్ యూపీహెచ్సీలను సందర్శించి టీకాల నిర్వహణ, రికార్డులు, డెంగ్యూ నివారణ చర్యలను పరిశీలించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, వైరల్ జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డా. భరత్ కుమార్, డా. దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

