రాయపర్తి మండలంలో మెరిసిన అధికారులు
ఉత్తమ గిర్దవార్గా తోట సంధ్యారాణి
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా మైస విక్రమ్
స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం
సేవలను గుర్తించి పురస్కారాలు అందించిన అధికారులు
కాకతీయ, రాయపర్తి : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలందించిన రాయపర్తి మండలానికి చెందిన ఇద్దరు అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం దక్కింది. శనివారం వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మంత్రి కొండా సురేఖ, జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా వారు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. రాయపర్తి మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు గిర్దవార్గా పనిచేస్తున్న తోట సంధ్యారాణికి ఉత్తమ గిర్దవార్ అవార్డు లభించింది. రెవెన్యూ సంబంధిత సేవలను ప్రజలకు సులభంగా అందించడంతో పాటు విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం అందుకున్నారు. తిర్మలాయపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ పంచాయతీ పాలనను ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన మైస విక్రమ్కు ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు దక్కింది. గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. తమ సేవలను గుర్తించి పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందని తోట సంధ్యారాణి, మైస విక్రమ్ తెలిపారు. ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందిస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో పాక శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.


