సీఎం పర్యటనకు ముస్తాబైన ములుగు
రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి నేడు శ్రీకారం
గట్టమ్మ ఆలయం వద్ద రూ.868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరణ
రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్కు ప్రారంభోత్సవం
మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్న సీఎం
అక్కడి నుంచే చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారం నుంచి ములుగు వరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణం, గట్టమ్మ ఆలయ సమీపంలోని పైలాన్ ప్రాంతం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, హెలిప్యాడ్లు, సీఎం ప్రయాణించే మార్గాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రూ.16,007 కోట్ల రహదారులకు శ్రీకారం
గ్రామీణ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న భారీ కార్యక్రమానికి ములుగు వేదిక కానుంది. రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ములుగు నుంచి ప్రారంభించనున్నారు. తొలి దశలో 2,145 రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గట్టమ్మ ఆలయ సమీపంలో ఇందుకు గుర్తుగా భారీ పైలాన్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలు, అలంకరణలు, పారిశుధ్యం, ల్యాండ్స్కేపింగ్తో పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వీఐపీ రాకపోకలు, పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు.
రూ.868 కోట్ల పనుల పైలాన్
ములుగు జిల్లాలో చేపట్టిన రూ.868 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రతిబింబించే మరో పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం నూతన కలెక్టరేట్ సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైలాన్ పరిసరాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, పారిశుధ్యం, పార్కింగ్, బారికేడింగ్ తదితర పనులను పూర్తి చేశారు. రూ.63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, వివిధ శాఖల కార్యాలయాలు, విద్యుత్, జనరేటర్, తాగునీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలతో భవనాన్ని నిర్మించారు. పరిసరాల్లో ల్యాండ్స్కేపింగ్, విద్యుత్ దీపాల అలంకరణ, పారిశుధ్య పనులను పూర్తి చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, బారికేడింగ్, అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.
మేడారంలో వనదేవతల దర్శనం
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణం వరకు రహదారులను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో బారికేడింగ్, క్యూలైన్లు, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్లు, భద్రతా సిబ్బంది, అత్యవసర మార్గాలు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. నిర్మాణ వ్యర్థాలు, గ్రానైట్ రాళ్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ల్యాండ్స్కేపింగ్, మొక్కలు, పూలతో ప్రాంగణాన్ని సుందరీకరించారు. మేడారం వేదికగా చేయూత పింఛన్ల లబ్ధిదారులకు సీఎం రేవంత్రెడ్డి మంజూరు పత్రాలను అందజేయనున్నారు. లబ్ధిదారులకు కూర్చునే సదుపాయం, తాగునీరు, వైద్య సహాయం తదితర ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ను కూడా సీఎం ప్రారంభించనున్నారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మేడారం చేరుకుంటారు. 1.40 నుంచి 1.50 గంటల వరకు సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి, ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. 2.20 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి గట్టమ్మ ఆలయ సమీపంలోని పైలాన్ వద్దకు చేరుకుని 2.30 గంటలకు రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. 2.40 గంటలకు రూ.868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ను ప్రారంభిస్తారు. అనంతరం రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమాలు ముగించుకుని 3 గంటలకు ములుగు డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ నుంచి హనుమకొండ జిల్లా పరకాల పర్యటనకు బయలుదేరుతారు.
పటిష్ట భద్రత.. సర్వం సిద్ధం
సీఎం పర్యటన నేపథ్యంలో మేడారం నుంచి ములుగు వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్, అగ్నిమాపక, వైద్య, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

