హరికుమార్ అంటే హడలెందుకు?
గతంలోనే కాంట్రాక్టర్ కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు!
మెమో జారీ చేయాలన్న కలెక్టర్ నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు
విచారణకూ ముందుకు రాని బల్దియా ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు
తాజాగా పనులు చేయకుండానే బిల్లుల వ్యవహారంలో చేతివాటం ఆరోపణలు
రూ.5 లక్షల కమీషన్ ఫోన్పే వ్యవహారంపై కమిషనర్ వెంకన్న దృష్టి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మహానగర పాలక సంస్థలో ఇంజినీరింగ్ అధికారి హరికుమార్ అంటే ఉన్నతాధికారులకు ఎందుకింత హడలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనపై గతంలోనే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు రావడం.. దీనిపై హరికుమార్కు మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం విచారణకు కూడా ముందుకు రాకపోవడం బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో ఆయనకున్న పలుకుబడికి నిదర్శనమన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగానే తాజాగా అభివృద్ధి పనుల విషయంలోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరే?
హన్మకొండ ప్రాంతంలో ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్న హరికుమార్పై గతంలో ఓ కాంట్రాక్టర్ కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం హరికుమార్కు మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆదేశాల మేరకు మెమో జారీ చేశారా? ఫిర్యాదుపై విచారణ చేపట్టారా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినా వాటిని అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫిర్యాదులోని అంశాలు నిజమో కాదో తేల్చేందుకు విచారణ జరపాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా చర్యలు కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది.
తాజాగా బిల్లుల వ్యవహారంలో ఆరోపణలు
గత వ్యవహారం మరుగునపడకముందే తాజాగా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంలో హరికుమార్పై మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు ముందుగానే కమీషన్గా ఫోన్పే ద్వారా తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారిక నిర్ధారణ అవసరం. నిజంగా రూ.5 లక్షల లావాదేవీ జరిగిందా? జరిగితే ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాకు డబ్బు బదిలీ అయింది? సంబంధిత పనికి సంబంధించిన ఫైల్లో ఏం ఉంది? పనులు పూర్తయ్యాయా? బిల్లుల ప్రక్రియ ఎక్కడ ఉంది? వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కమిషనర్ దృష్టికి వ్యవహారం
తాజా ఆరోపణల నేపథ్యంలో బల్దియా కమిషనర్ టి. వెంకన్న ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం. హరికుమార్పై వచ్చిన ఆరోపణలను పరిశీలించి చర్యల అంశాన్ని చూడాలని సూపరింటెండింగ్ ఇంజినీర్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారైనా వ్యవహారం విచారణ దశ దాటి చర్యల వరకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కలెక్టర్ ఆదేశాల అమలుపై స్పష్టత లేకపోవడం, తాజాగా కమిషనర్ స్థాయిలో దృష్టి సారించినట్లు సమాచారం రావడంతో బల్దియా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరోపణలు నిరాధారమైతే రికార్డులతో స్పష్టత ఇవ్వాలి.. నిజమైతే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఒకే అధికారిపై వరుస ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది.

