ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!
మామిడిపల్లిలో శిథిలాల కింద చిక్కుకుని మహిళ దుర్మరణం
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని గ్రామస్థుల ఆరోపణ
అర్హులైన పేదలకు ఇళ్లు అందుతున్నాయా? అంటూ ప్రశ్నలు
గుమ్మడి లక్ష్మి (బుజ్జక్క) మృతితో గ్రామంలో తీవ్ర విషాదం
కాకతీయ, కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మి (బుజ్జక్క) నివాసం ఉంటున్న పాత ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మి కుటుంబం చాలాకాలంగా శిథిలావస్థకు చేరిన పాత ఇంట్లోనే జీవిస్తోంది. ఇంటి పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో కొత్త ఇల్లు నిర్మించుకోలేక అదే ఇంట్లో ఉంటున్నారని గ్రామస్థులు తెలిపారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లక్ష్మి కుటుంబం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఇల్లు మంజూరై ఉంటే కుటుంబానికి సురక్షితమైన నివాసం లభించి ఉండేదని, ఈ విషాదాన్ని నివారించే అవకాశం ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. “ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉన్నా.. నిరుపేద కుటుంబానికి సురక్షితమైన ఇల్లు ఎందుకు అందలేదు?” అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన పేదల దరఖాస్తులను అధికారులు ఏ ప్రాతిపదికన పరిశీలిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
కుటుంబం కన్నీరుమున్నీరు
లక్ష్మి మృతితో ఆమె భర్త కమలాకర్, కుమారుడు పవన్, కుమార్తె రోహిణి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిరుపేద కుటుంబానికి సురక్షితమైన ఇల్లు అందక, చివరకు అదే శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడం బాధాకరమని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సురక్షిత నివాసం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కోనరావుపేట మండలంలోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను అధికారులు గుర్తించి, ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న కుటుంబాలను అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

