420 హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులా?
ప్రజా ఉద్యమాలను అరెస్టులతో అడ్డుకోలేరు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్తాం
హామీల అమలుకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు
మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
కాకతీయ, హన్మకొండ : ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తరఫున నిరసన చేపడుతుంటే పోలీసులతో అడ్డుకోవడం సరికాదన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చెప్పుకోదగిన స్థాయిలో అమలు జరగలేదని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఛార్జ్షీట్ను ప్రజల ముందు ఉంచుతున్నామని వినయ్భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను అభివృద్ధిలో ముందంజలో నిలిపితే.. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలు, పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.


అనుమతి ఉన్నా నిరసనకు అడ్డంకులు..
హామీల అమలును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారని వినయ్భాస్కర్ తెలిపారు. ఆదాలత్ సర్కిల్ వద్ద తనను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారని చెప్పారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుబేదారి జంక్షన్లో నిరసనను కొనసాగించారని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నారు. అరెస్టులు, కేసులతో ప్రజా ఉద్యమాలను నిలువరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుబేదారి పోలీస్స్టేషన్లో అరెస్టయిన వినయ్భాస్కర్కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. హామీల అమలును ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులు, అరెస్టులను ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

