సీఎం బ్లాక్ మెయిల్ చేశారు
బర్తరఫ్పై పశ్చాత్తాపం లేదు
తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు
ముందు నన్ను ప్రశ్నించాలి.. రాజీనామా కోరాలి
నేరుగా గవర్నర్కు ఎలా పంపిస్తారు?
వంద మంది మాట్లాడుతుంటే.. నన్నే ఎందుకు టార్గెట్ చేశారు?
నా కూతురు వ్యాఖ్యలకు నన్నెందుకు బాధ్యురాలిని చేస్తారు?
బీసీ మహిళను ఇలా అవమానించడం సరికాదు
కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లే ఆలోచన లేదు
సోనియా, రాహుల్, ప్రియాంకలపై గౌరవంతోనే కొనసాగుతున్నా
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీమంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ‘‘నా కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నన్నెందుకు బాధ్యురాలిని చేస్తున్నారు? ఆమె స్వతంత్రంగా ఉన్న మహిళ. ఆమె ఆలోచనలు, ఆమె నిర్ణయాలు ఆమెవి. వాటికి నేను ఎలా బాధ్యురాలిని అవుతాను? నేను ఎలాంటి తప్పూ చేయలేదు. తప్పు చేయనప్పుడు పశ్చాత్తాపపడాల్సిన అవసరం నాకు లేదు’’ అని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనపై తీసుకున్న చర్య వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఓ టీవీ చానెల్తో మాట్లాడిన ఆమె తాజా రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా కొంతకాలంగా పనిచేస్తున్న నేతలు సుస్మిత వ్యాఖ్యలను ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తన వివరణను పార్టీ అధిష్ఠానానికి పూర్తిగా ఇచ్చినా.. తనను సంప్రదించకుండా నేరుగా మంత్రి పదవి నుంచి తొలగించే నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తనను ముందుగా ప్రశ్నించి, వివరణ తీసుకుని, రాజీనామా చేయాలని అడగాల్సి ఉందని.. అలా కాకుండా నేరుగా గవర్నర్కు లేఖ పంపడం తనకు షాక్ కలిగించిందన్నారు.
ముందు నన్ను ప్రశ్నించాలి.. ఆ తర్వాతే చర్యలుండాలి
రూల్ ప్రకారం ముందుగా నన్ను ప్రశ్నించాలి. ఏం జరిగిందో అడగాలి. రాజీనామా చేయమని చెప్పాలి. ఇవేమీ చేయకుండా నేరుగా సీఎస్తో గవర్నర్కు పంపించారు. ఆ లేఖలో ఒక సంతకం లేదు. ఒక లెటర్హెడ్ లేదు. వైట్ పేపర్పై రాసి పంపించారు. ఇది సరైన విధానం కాదు. ముందుగా నా ఒపీనియన్ తీసుకోవాలి. నన్ను రాజీనామా చేయమని అడగాలి. ఆ తర్వాతే పార్టీ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోవాలి. కానీ నాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నేను రాజీనామా చేస్తే మంచిదని, లేకపోతే పార్టీ నుంచి వేటు వేస్తామని ముందుగానే ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఈ రోజు వచ్చిన లేఖ నాకు నిజంగానే షాక్. అధిష్ఠానం నన్ను ముందుగా అడుగుతుందని నేను అనుకున్నాను. నేరుగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదనేదే నా అభిప్రాయం అని సురేఖ అన్నారు. గతంలో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘షోకాజ్ నోటీసుకు నేను నా వివరణ ఇచ్చాను. నా కూతురు వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పాను. అధిష్ఠానానికి కూడా ఇదే విషయం వివరించాను. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు కూడా నా మాట పూర్తిగా విన్నారు. ‘చూస్తాం’ అన్నారు. అంతే తప్ప రాజీనామా చేయాలని గానీ, వ్యాఖ్యలను ఖండించాలని గానీ, లేదంటే చర్యలు తప్పవని గానీ నాకు చెప్పలేదు’’ అని తెలిపారు.
నన్నే ఎందుకు టార్గెట్ చేశారు?
రాజకీయాల్లో వంద మంది వంద రకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఆ వంద మందిలో ఎవరినీ ముట్టుకోకుండా కొండా సురేఖనే ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది? వాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నన్ను వంద శాతం టార్గెట్ చేశారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఒక ఆయుధంగా దొరికాయి. దాని కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తున్న వాళ్లు ఇప్పుడు దాన్ని ఉపయోగించుకున్నారు. నా మీద కొంతమంది నేతలు ఒక ప్రణాళికతో పనిచేస్తున్నారు. ఇవాళ జరిగిన పరిణామం దానికి ఫలితమే’’ అని సురేఖ ఆరోపించారు. తనపై కుట్రకు పాల్పడిన వారిలో కొంతమంది నేతల పేర్లను కూడా ప్రస్తావించారు. ‘‘కొండాల్రెడ్డి, తిరుపతిరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు నా వ్యతిరేకంగా పనిచేశారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మా ఇన్చార్జిగా ఉన్నప్పటి నుంచే నా మీద పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. వరంగల్లో ఒక గ్రూపుగా పనిచేస్తున్న కొంతమంది నేతలకు ఒక వర్గంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్లంతా కలిసి ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలు అందుకు అవకాశం కల్పించాయి’’ అని ఆమె పేర్కొన్నారు. నా కుటుంబ సభ్యులు సుస్మితతో మాట్లాడించి వ్యాఖ్యలు చేయించారని అనుకోవడం కూడా తప్పు. ఆమెకు పెళ్లయింది. ఒక ఇంటి కోడలిగా వెళ్లింది. ఆమె ఆలోచనలు ఆమెవి. నిర్ణయాలు ఆమెవి. మేము ఆమెను ఎలా నియంత్రించగలం? ఇవాళ అందరూ రాజకీయంగా తమ పిల్లలను ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరి కుటుంబంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చూడాలని సురేఖ అన్నారు.
సీఎం బ్లాక్మెయిల్ చేశారనే సమాచారముంది
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేశారనే సమాచారం నాకు ఉంది. ‘ఆమెను తొలగించకపోతే నేను వెళ్లిపోతాను’ అనే రీతిలో ఆయన అధిష్ఠానం వద్ద మాట్లాడారని నాలుగు రోజులుగా సమాచారం ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చిందని నేను భావిస్తున్నాను. అయితే హైకమాండ్ మొదటి నుంచే నన్ను తొలగించాలని అనుకున్నదని నేను అనుకోవడం లేదు. నేను సీనియర్ బీసీ మహిళను. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రెండోసారి మంత్రిగా పనిచేశాను. ఇలాంటి నేపథ్యం ఉన్న నన్ను ఈ విధంగా వ్యవహరించడం బాధ కలిగిస్తోంది’’ అని సురేఖ అన్నారు. రేవంత్రెడ్డిపై తనకున్న గత అభిమానం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత నేను అంతగా అభిమానించిన నాయకుడు రేవంత్రెడ్డే. ఆయన పీసీసీ అధ్యక్షుడు కావాలని నేను కోరుకున్నాను. ఆకాంక్షించాను. అలాంటి వ్యక్తే ఈ రోజు నన్ను మంత్రి పదవి నుంచి తొలగించే పరిస్థితి రావడం బాధ కలిగిస్తోంది. రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు జరుగుతాయి. కానీ నేను అనుభవిస్తున్న పరిస్థితి మాత్రం నన్ను ఆవేదనకు గురిచేస్తోందని అన్నారు.
బీసీ మహిళను అవమానించడం సరికాదు
ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో చాలా జరుగుతున్నాయి. కానీ నా విషయంలోనే ఎందుకు ఇలా వ్యవహరించారు? ఒక బీసీ మహిళను అవమానించడం సరికాదు. నేను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రెండోసారి మంత్రిగా ఉన్నాను. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న బీసీ మహిళల్లో నేను ముందున్నాను. రేపు ఒక బీసీ మహిళను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన వస్తే.. ఆ అవకాశానికి మొదటి అర్హత ఉన్నవారిలో కొండా సురేఖ ఉంటుంది. అలాంటి నన్ను ఈ రోజు ఇలా అవమానించడం బాధాకరమని ఆమె అన్నారు. బీసీలకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? నా విషయంలో ఒక విధంగా, ఇతరుల విషయంలో మరో విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రులు, నేతలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్లను ఎందుకు ప్రశ్నించలేదు? నన్నే ఎందుకు టార్గెట్ చేశారు? ఇవన్నీ పార్టీ ఆలోచించాలని సురేఖ ప్రశ్నించారు.
తన కుమార్తె వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని, అదే సమయంలో ఖండించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ‘‘సుస్మిత ఒక ఇండిపెండెంట్ మహిళ. ఆమె ఏం మాట్లాడాలో నేను చెప్పలేను. ఆమె వ్యాఖ్యలను నేను సమర్థించడం లేదు. ఖండించడం కూడా లేదు. ఆమె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం మాత్రం సరికాదు. నేను క్యాబినెట్లో ఉన్నందున నా రాజకీయ బాధ్యత వేరు. ఆమె పార్టీ సభ్యురాలు కూడా కాదు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు నేను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అన్నారు.
కాంగ్రెస్ను వీడే ఆలోచన లేదు..
ఇప్పటి పరిణామాలతో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అనుకోవడం లేదు. మాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అంటే ఎంతో గౌరవం. కాంగ్రెస్ పార్టీతో మా కుటుంబానికి అనుబంధం ఉంది. వాళ్లను చూసే మేము పార్టీలో ఉన్నాం. 2018లో కూడా కొంతమంది దుష్టశక్తులు మా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు టికెట్లు రాకపోవడంతోనే మేము టీఆర్ఎస్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరే ఉద్దేశంతో వెళ్లడం కాదు’’ అని సురేఖ అన్నారు. ప్రస్తుతం తదుపరి కార్యాచరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘‘ఇప్పుడే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. నా భర్త కొండా మురళితో మాట్లాడాలి. జరిగిన పరిణామాలన్నింటినీ చర్చించుకోవాలి. ఆ తర్వాతే ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తాం. ఇప్పుడు నాకు పూర్తిగా ఆర్డర్లు కూడా అందలేదు. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. అన్ని విషయాలను డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాను. అప్పుడు ప్రెస్మీట్ పెట్టి నా అభిప్రాయాన్ని మీడియా ముందే స్పష్టంగా చెబుతానని సురేఖ తెలిపారు. తనపై తీసుకున్న చర్యపై పశ్చాత్తాపం లేదని ఆమె తేల్చిచెప్పారు. ‘‘నేను ఏం తప్పు చేయలేదు. తప్పు చేసి ఉంటే, అందుకు నన్ను డిస్మిస్ చేసి ఉంటే ప్రజలు కూడా దాన్ని ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు జరిగినది కరెక్ట్ కాదు. అది వాళ్లకు కూడా తెలుసు.. నాకు కూడా తెలుసు. కాబట్టి నాకు పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కర్మఫలం అంటారు. నా విషయంలో ఏం జరిగిందో కాలమే చెబుతుంది. నేను మాత్రం చట్టబద్ధంగా, రాజకీయంగా నా తదుపరి నిర్ణయం తీసుకుంటాను’’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.

