ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?
మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా..
ఎమ్మెల్యేల మెడలు పట్టి గెంటేస్తారా?
ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం దుర్మార్గం
బీఆర్ఎస్ లేకుండా సభ నడపడం ప్రజాస్వామ్యమా?
22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ఎన్ని కుట్రలు చేసినా ప్రజల సమస్యలపై పోరాటం ఆపం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్రావు ప్రశ్నించారు. మహిళా శాసనసభ్యుల చీరెలు లాగడం, ఎమ్మెల్యేల మెడలు పట్టి గెంటేయడం, ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో సోమవారం జరిగిన పరిణామాలు బ్లాక్ డేగా మిగిలిపోతాయని అన్నారు. మహిళా సభ్యుల చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్ వద్ద హరీశ్రావు మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీ రీయింబర్స్మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై సభలో మాట్లాడితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతో తమపై పోలీసులను ప్రయోగించారని ఆరోపించారు.

మహిళా సభ్యులపై దాడులను మరిచిపోం
మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషంగా, అమానవీయంగా ఉందని హరీశ్రావు అన్నారు. మహిళా శాసనసభా నాయకుల చీరెలు లాగుతారా, వారి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. సునితమ్మ చీర లాగిన పోలీసులు, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులు, జగదీష్రెడ్డి గారిని కిందపడేసిన వారిని ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యల్లో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారని హరీశ్రావు తెలిపారు. కేటీఆర్ చేయి, ముఖంపై గీరుకుపోయిందని, యాదవ్రెడ్డి కుడికాలు గోరు పోయిందని, రాజశేఖర్రెడ్డి కాలు కమిలిపోయిందని, సంజయ్ చేయికి దెబ్బ తగిలిందని వివరించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి ఈ ఘటనలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
సభ నుంచి మమ్మల్ని ఎందుకు బయటకు పంపారు?
ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ఫిక్సింగ్ చేసుకొని 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై నామమాత్రపు చర్చకు పరిమితం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ లేకుండా సభలో చర్చ జరపడం ప్రజాస్వామ్యం కాదన్నారు. తమను సస్పెండ్ చేయడానికి పథకం ప్రకారం కుట్ర చేశారని విమర్శించారు. రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ నల్ల టీషర్టులు ధరించి పార్లమెంట్కు వెళ్లి నిరసన తెలిపిన విషయాన్ని హరీశ్రావు గుర్తుచేశారు. అక్కడ నిరసనలకు అవకాశం ఉన్నప్పుడు తెలంగాణలో మాత్రం ప్రజల తరఫున నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తాము రేవంత్రెడ్డిలా బడివే అనలేదని, పైల్వాన్లు ఉన్నారని, కొడతారని బెదిరించలేదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతున్నామని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సమాధానం చెప్పాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 3 ఏళ్లుగా చెల్లించడం లేదని హరీశ్రావు అన్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, వందలాది మంది ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు చేయలేకపోతున్నామని, ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 22ఏ భూముల సమస్యతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను సభలో లేకుండా చేసేందుకు మ్యాచ్ఫిక్సింగ్ చేశాయని, ఒక పథకం ప్రకారం కుట్ర చేశాయని హరీశ్రావు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్ వైఫల్యాలపై పోరాటాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కాంలు, వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను సభ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. తమ మహిళా సభ్యులపై జరిగిన దాడిని చూస్తూ ఊరుకునేది లేదని హరీశ్రావు అన్నారు. ఒక మహిళా సభ్యురాలి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోవాలా, ఒక అక్క గొంతు పిసికితే చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరపడం అంటే ప్రభుత్వం తప్పు చేసినట్లేనని అన్నారు. తప్పు చేయకపోతే సంబంధిత అంశాలను ఎందుకు సభ ఎజెండాలో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు, కుట్రలు ఎదురైనా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, చివరకు ప్రజాక్షేత్రంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హరీశ్రావు అన్నారు.

