మత్తును వదిలి.. జీవితాన్ని ఎంచుకోండి
వ్యసనాన్ని దాచకుండా చికిత్సకు ముందుకు రావాలి
వ్యసన విముక్తికి పోలీసుల చొరవ : వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
ఎంజీఎం ఏటీఎఫ్ కేంద్రంలో వైద్యం, కౌన్సెలింగ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : మత్తు పదార్థాలకు బానిసైన వారు వ్యసనాన్ని దాచకుండా చికిత్స, కౌన్సెలింగ్ కోసం ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటూనే వ్యసనానికి గురైన వారిని శిక్షించడం మాత్రమే కాకుండా చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈగల్ ఫోర్స్ సహకారంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ఏటీఎఫ్) కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి పడకల సామర్థ్యాన్ని 10 నుంచి 20కి పెంచారు. సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లతోపాటు క్యారమ్, చెస్ వంటి సౌకర్యాలు కల్పించారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం, కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ సేవలు అందించనున్నారు. పిల్లలు లేదా కుటుంబ సభ్యులు మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తిస్తే సమస్యను దాచకుండా వెంటనే చికిత్స అందించాలని పోలీసులు సూచించారు. సహాయం కోసం 87125 84473, 87126 85299 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రాంరెడ్డి, పోలీసు, ఎంజీఎం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

