ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం
అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయం
అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం చేశారు
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా
లోక్భవన్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
బాబాసాహెబ్ చిత్రపటానికి గవర్నర్ నివాళులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం లోక్భవన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… డా. అంబేద్కర్ను భారతదేశపు గొప్ప పుత్రులలో ఒకరిగా, రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా అభివర్ణించారు. “ప్రతికూలతలపై మానవ స్ఫూర్తి సాధించిన విజయానికి అంబేద్కర్ జీవితం నిదర్శనం అన్నారు. దార్శనిక సంఘ సంస్కర్త, ప్రముఖ న్యాయకోవిదుడైన ఆయన న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం చేశారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్న గవర్నర్, రాజ్యాంగ ఆదర్శాల పట్ల ప్రతి పౌరుడూ నిబద్ధతను పునరుద్ఘాటించాలన్నారు. “బాబాసాహెబ్ ప్రతిపాదించిన ఐక్యత, సౌభ్రాతృత్వ స్ఫూర్తితో ముందుకు సాగాలి. దేశ వైభవాన్ని పునరుద్ధరించడానికి, అందరికీ న్యాయమైన, సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి సమిష్టిగా కృషి చేద్దాం” అని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్, లోక్భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

