జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర
ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా
ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీపై పోరాటం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి
టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ పిలుపు
పార్టీ బలోపేతంపై టీఆర్పీ జిల్లా నాయకుల సమీక్ష
కాకతీయ, హనుమకొండ: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ప్రకటించింది. హనుమకొండ జిల్లా టీఆర్పీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల దోపిడీని అరికట్టడమే లక్ష్యంగా ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ‘మహా ధర్నా’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు హనుమకొండ జిల్లా నుంచి తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. టీఆర్పీలో చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని భరోసా ఇచ్చారు.
ఎన్నికలకు సన్నద్ధం..
జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. వచ్చే జూన్ 2వ తేదీ నుంచి పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ప్రారంభించనున్న పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

