వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!
నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి
‘కాకతీయ’ స్టాఫర్పై ములుగు పీఎస్లో కంప్లైంట్
ములుగు డీటీవో ఈశ్వర్సింగ్ ఠాకూర్ తాటాకు చప్పుళ్లు
కార్యాలయంలో బనియన్తో విధులు
లీవ్లో ఉన్నా అధికారిక లాగిన్ వాడకం
పక్కా ఆధారాలతో ‘కాకతీయ’ కథనాలు..
ఉన్నతాధికారుల మౌనంపైనా ప్రశ్నలతో కథనం
వాస్తవ కథనాలు జీర్ణించుకోలేకపోతున్న జిల్లా రవాణా అధికారి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై ‘కాకతీయ’ ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రచురిస్తుండగా.. వాటికి వివరణ ఇవ్వాల్సిన జిల్లా రవాణా అధికారి ఈశ్వర్సింగ్ ఠాకూర్ మాత్రం వార్తలు రాసిన ములుగు జిల్లా ‘కాకతీయ’ స్టాఫర్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం నేరమా.. లేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విలేకరిపై ఫిర్యాదు చేయడం అధికారి వైఖరిని తేటతెల్లం చేస్తోంది.
ములుగు జిల్లా రవాణా శాఖ అధికారి ఈశ్వర్సింగ్ ఠాకూర్ సెలవులో ఉన్న రోజున ఆయన సంతకంతో అధికారిక లాగిన్, డిజిటల్ సంతకాల ద్వారా ధ్రువపత్రాలు జారీ అయిన అంశంపై ‘కాకతీయ’ స్పష్టమైన కథనాన్ని ప్రచురించింది. సంబంధిత వివరాలు, ఆధారాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించింది. డీటీవో విధుల్లో లేనప్పుడు ఆయన అధికారిక లాగిన్ ఎవరు ఉపయోగించారు? లాగిన్ వివరాలు ఇతరుల చేతికి ఎలా వెళ్లాయి? డిజిటల్ సంతకం ఎవరు వినియోగించారు? అధికారి స్థానంలో మరెవరైనా అధికారికంగా బాధ్యతలు నిర్వహిస్తే ఆ ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి? అన్న ప్రశ్నలతో కథనాలను ప్రచురించింది. ఇవన్నీ సాంకేతిక రికార్డులతో తేల్చగల అంశాలే కదా. సిస్టమ్ లాగ్లు, ఐపీ వివరాలు, హాజరు రికార్డులు, జారీ చేసిన ధ్రువపత్రాలను పరిశీలిస్తే నిజం బయటపడదా? మరి విచారణ జరిపించకుండా విలేకరిపై ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేంటి?


కార్యాలయంలో బనియన్తో విధులు.. నిబంధనలు ఎవరికి..?!
ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనివేళల్లో ఉన్నతాధికారి బనియన్తో విధులు నిర్వహిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఫొటోలతో ‘కాకతీయ’ గతంలో కథనం ప్రచురించింది. ప్రభుత్వ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారి విధి నిర్వహణలో పాటించాల్సిన క్రమశిక్షణ, కార్యాలయ ప్రవర్తనా నియమాలపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రజలకు నిబంధనలు చెప్పే అధికారి.. ప్రభుత్వ కార్యాలయంలో తాను పాటించాల్సిన కనీస నియమాలను పాటించకపోవడంపై నిలదీసింది. ములుగు జిల్లాలో ఇసుక రవాణా చేసే లారీల నుంచి నెలకు రూ.7,500 వరకు అనధికారికంగా వసూలు చేస్తున్నారనే సమాచారం కూడా ‘కాకతీయ’ కథనాల్లో వెలుగులోకి వచ్చింది. లారీ యజమానులు, డ్రైవర్లపై ఒత్తిడి తెస్తున్న వ్యవహారం, సంబంధిత అధికారులు పాత కారును టెంపరరీ రిజిస్ట్రేషన్ బోర్డుతో ఉపయోగిస్తూ ఇసుక లారీలను ఆపి అనధికారిక వసూళ్లు చేస్తున్నారనే అంశాలను కథనాలు ప్రస్తావించాయి. ఈ వసూళ్లపై శాఖాపరంగా విచారణ జరిగిందా? ఎన్ని లారీలను ఆపారు? ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎంత మొత్తంలో జరిమానాలు విధించారు? తనిఖీలకు ఉపయోగించిన వాహనం ఎవరిది? దాని టెంపరరీ రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో ఉందా? అన్న వివరాలను అధికారులు ఎందుకు వెల్లడించడం లేదు?
వార్తలపై చర్యలు పక్కనపెట్టి.. విలేకరిపై ఫిర్యాదా?!
డీటీవో కార్యాలయంలోని వ్యవహారాలపై వరుస కథనాలు వస్తున్నప్పుడు వాటిలో వాస్తవం లేదని భావిస్తే.. సంబంధిత అధికారి ఆధారాలతో వివరణ ఇవ్వవచ్చు. ఏ అంశం తప్పో అధికారికంగా ప్రకటించవచ్చు. అవసరమైతే శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అది కాకుండా వార్తలు రాసిన విలేకరిపై ములుగు పీఎస్లో ఫిర్యాదు చేయడం ఎందుకు? ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాలను ప్రశ్నించినందుకేనా? వార్త తప్పయితే ఆధారాలతో ఖండించకుండా పోలీస్ ఫిర్యాదు చేయడం ద్వారా అసలు విషయాలు మరుగునపడతాయా? విలేకరులను ఫిర్యాదులతో భయపెట్టగలమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలు జర్నలిస్టు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారుల మౌనం.. డీటీవోకు ధైర్యమా..?!
డీటీవోపై లాగిన్, డిజిటల్ సంతకం, కార్యాలయ క్రమశిక్షణ, ఇసుక లారీల వ్యవహారం తదితర అంశాలపై వరుసగా ప్రశ్నలు వస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన స్పందన కనిపించడం లేదు. డీటీవోపై ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా శాఖాపరమైన విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? పైస్థాయి అధికారులకు సమాచారం లేదా? సమాచారం ఉంటే చర్యలు ఎందుకు లేవు? విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు బయటపడతాయనే భయమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల మౌనం వల్లే డీటీవోకు మరింత ధైర్యం వస్తోందన్న చర్చ కూడా సాగుతోంది.
‘నాకు భయం ఎందుకు.. అధికారులు మావోల్లే..?!’
తనపై ఎన్ని కథనాలు వచ్చినా ఎవరూ ఏమీ చేయలేరన్న ధోరణితో సదరు అధికారి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగైదు రోజులు వార్తలు రాసి ఆ తర్వాత అంతా మౌనమైపోతారన్న ధైర్యం ఉంటే.. దానికి కారణం ఏమిటి? ఉన్నతాధికారుల అండ ఉందన్న నమ్మకమా? ఫిర్యాదులు, కథనాలు పట్టించుకోరన్న ధీమానా? లేక తనపై ఎలాంటి చర్యలు ఉండవన్న హామీ ఏదైనా ఉందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలకు నిబంధనలు వర్తింపజేసే శాఖలో.. అధికారుల వ్యవహారాలపై ప్రశ్నలు వస్తే మాత్రం సమాధానాల స్థానంలో ఫిర్యాదులు రావడం ఏ విధమైన జవాబుదారీతనం? ప్రశ్నించిన కలాన్ని పోలీస్ ఫిర్యాదులతో ఎదుర్కోవడం ద్వారా అసలు ప్రశ్నలు సమాధానం లేనివిగానే మిగిలిపోతాయి. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్, రవాణా శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని డీటీవో ఈశ్వర్సింగ్ ఠాకూర్ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

