ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం
పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు
మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించాలి
సేంద్రియ ఎరువుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి
రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, గీసుగొండ : ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందడంతో పాటు పంటల వైవిధ్యీకరణ ద్వారా వాతావరణ మార్పులు, మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వివిధ రకాల ఉద్యాన పంటలను సాగు చేయాలని, తక్కువ నీటితో మెరుగైన దిగుబడుల కోసం బిందు సేద్యం, తుంపర సేద్యం, మల్చింగ్ పద్ధతులను వినియోగించాలని తెలిపారు. కోనాయిమాకుల రైతు వేదిక వద్ద ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్, వివిధ కూరగాయల పంటల రైతులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజ్వల్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించి సేంద్రియ ఉత్పత్తులను పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఉద్యాన శాఖ రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యం
బయో ఇన్పుట్ కేంద్రాల ద్వారా తయారు చేసిన వర్మీ కంపోస్ట్, సిటీ కంపోస్ట్, వర్మీ వాష్, వర్మిటీ, వావిలాకు కషాయం, జీవామృతం, వేస్ట్ డీకంపోజర్ తదితర ఉత్పత్తులను రైతులకు పరిచయం చేశారు. సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన పంటలు పండించవచ్చని వివరించారు. లింగాకర్షణ బుట్టలు, జిగురు రంగు అట్టలు, వ్యక్తిగత రక్షణ పరికరాలను రాయితీపై అందుబాటులో ఉంచారు. వరంగల్ గోల్డ్, సిటీ కంపోస్ట్ ఉత్పత్తులను కలెక్టర్ అభినందించారు. లక్ష్మీపురం డంపింగ్ యార్డు వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసి సేంద్రియ ఎరువులుగా మార్చాలని అధికారులను ఆదేశించారు.
400 మంది రైతులు పాల్గొన్నారు
శాస్త్రవేత్తలు కూరగాయల ఆధునిక సాగు, నేల ఆరోగ్యం, మొక్కల సంరక్షణ, తెగుళ్ల నివారణ, సమగ్ర సస్యరక్షణపై అవగాహన కల్పించారు. వరంగల్ ఆర్డీఓ సుమ, గీసుగొండ తహసీల్దార్ ఎం.డి.రియాజుద్దీన్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఆర్.శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి పి.హరిప్రసాద్బాబు, ప్రజ్వల్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పెద్దపల్లి రామ్మూర్తి, ప్రాజెక్టు మేనేజర్ ఇన్నారెడ్డి, సమాచార నిర్వహణ వ్యవస్థ సమన్వయకర్త అక్కల రమేష్, యూనిట్ మేనేజర్ అయేషా, అధికారులు, సర్పంచులు, వివిధ రంగాల ప్రతినిధులు, సుమారు 400 మంది రైతులు పాల్గొన్నారు.

